మనిషి రూపంలో ఉన్న మృగం, ఒళ్లంతా కామం.. కోల్‌కతా డాక్టర్ కేసులో నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు

అతని బుర్రంతా కామంతో నిండిపోయిందని, మొబైల్ నిండా బూతు వీడియోలున్నాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. అశ్లీల వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాడని, అదో వ్యసనంగా మారిందని పేర్కొన్నారు.

మనిషి రూపంలో ఉన్న మృగం, ఒళ్లంతా కామం.. కోల్‌కతా డాక్టర్ కేసులో నిందితుడి గురించి విస్తుపోయే విషయాలు

Sanjoy Roy (Photo Credit : Google)

Sanjoy Roy : బాధ లేదు.. భయం లేదు.. పశ్చాతాపం అంతకన్నా లేదు. వాడు మనిషి రూపంలో ఉన్న మృగం. ఒళ్లంతా కామం.. సెల్ ఫోన్ లో అశ్లీలం. కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ పై అఘాయిత్యానికి ఒడిగట్టిన దుర్మార్గుడి గురించి విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పోర్నోగ్రఫీకి బానిస..
కోల్ కతా డాక్టర్ అత్యాచారం- హత్య నిందితుడు సంజయ్ రాయ్ గురించి మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. అతనిపై చేసిన సైకో అనలిటిక్ ప్రొఫైలింగ్ లో.. సంజయ్ వికృత చేష్టలు చేసేవాడని, పోర్నోగ్రఫీకి బానిస అని తేలింది. ఈ వివరాలను సీబీఐ అధికారి తెలిపారు. సంజయ్ మనిషి రూపంలో ఉన్న జంతువు అని వెల్లడించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన సంజయ్ కు ఎలాంటి పశ్చాత్తాపం లేదని పేర్కొన్నారు.

ఫోన్ నిండా బూతు వీడియోలే.. ఎలాంటి ఎమోషన్స్ లేని నీచుడు..
సీబీఐ విచారణలో సంజయ్ రాయ్ గురించి సంచలన విషయాలు తెలిశాయి. అతని బుర్రంతా కామంతో నిండిపోయిందని, మొబైల్ నిండా బూతు వీడియోలున్నాయని సీబీఐ అధికారులు వెల్లడించారు. అశ్లీల వీడియోలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాడని, అదో వ్యసనంగా మారిందని పేర్కొన్నారు. మనిషిలా కాకుండా మృగంలా ప్రవర్తిస్తున్నాడని వెల్లడించారు. అసలు ఆ దుర్మార్గుడికి ఎలాంటి ఎమోషన్స్ లేవని స్పష్టం చేశారు. ఎక్కడా తడుముకోకుండా తాను ఏం చేశాడన్నది మొత్తం వివరించినట్టు అధికారులు తెలిపారు.

హత్యాచారానికి ముందు రోజు ట్రైనీ డాక్టర్ కు వేధింపులు..
ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9న హత్యాచారం జరిగే ముందు రోజు అంటే ఆగస్టు 8వ తేదీన ట్రైనీ డాక్టర్ ని నిందితుడి సంజయ్ రాయ్ వేధించినట్టు తేలింది. చెస్ట్ మెడిసిన్ వార్డులో ఆమె పని చేస్తూ ఉండగా వేధించినట్టు వెల్లడైంది. పోలీసుల విచారణలో ఈ విషయాన్ని నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. నిందితుడు చెప్పిన వివరాల ప్రకారం ఆగస్టు 8న చెస్ట్ వార్డ్ వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పోలీసులు పరిశీలించారు. బాధితురాలితో పాటు మరో నలుగురు జూనియర్ డాక్టర్లను నిందితుడు గుచ్చిగుచ్చి చూసినట్టు అందులో రికార్డ్ అయింది. వాళ్లు ఇబ్బంది పడేలా పదేపదే చూసినట్టు అధికారులు గుర్తించారు.

మరుసటి రోజు ఆగస్టు 9న సంజయ్ రాయ్ ట్రైనీ డాక్టర్ పై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆగస్టు 9న అర్ధరాత్రి ఒంటి గంటకు డిన్నర్ కోసం బాధితురాలు సెమినార్ హాల్ కు వెళ్లింది. 2.30 గంటలకు ఓ డాక్టర్ తో మాట్లాడింది. ఆ తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకుంది. ఆమె ఒంటరిగా ఉన్న సమయం చూసి నిందితుడు హత్యాచారం చేసి.. హత్య చేశాడు. తెల్లవారుజామున 4 గంటలకు సంజయ్ రాయ్ హాస్పిటల్ లోకి వచ్చినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. ఆగస్టు 9వ తేదీన ఈ ఘటన జరగ్గా సీసీటీవీ ఫుటేజ్, బ్లూటూత్ డివైజ్ ఆధారంగా పోలీసులు సంజయ్ రాయ్ ని అరెస్ట్ చేశారు.