మహారాష్ట్రలో సాధువును హత్యచేసిన రౌడీ షీటర్

మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో సాధువుని హత్యచేయటం కలకలం రేపుతోంది. స్వామీజీతో పాటు, ఆశ్రమ వాచ్ మెన్ కూడా ఈ ఘటనలో హతమయ్యాడు. పాలఘర్ లో ఇద్దరు సాదువులు హత్యకు గురైన కొన్ని రోజుల్లోనే మరోసారి జంట హత్యలు జరగడం కలకలం రేపుతోంది.
నాందేడ్ జిల్లా ఉమ్రి తాలూకా నగ్దానా గ్రామంలో శివాచార్య నిర్ణయ్ రుద్రప్రతాప్ మహరాజ్ (33) ఆశ్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం తెల్లవారుఝూమున 4 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన సాయినాథ్ లింగాడే అనే రౌడీ షీటర్ ఆశ్రమంలోకి చొరబడి వాచ్ మెన్ భగవాన్ షిండేను(50) హత్యచేసి అతని కనుగుడ్లు పీకేశాడు. అనంతరం ఆశ్రమంలోకి వెళ్ళి సాధువు రుద్రప్రతాప్ మహారాజ్ ని నిద్రలేపి కళ్లల్లో కారం చల్లి హతమార్చాడు.
సాధువు మృతదేహాన్ని మూటకట్టి, సాధువు కారులోనే వేరే చోటికి తరలించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో బయటకు వెళుతుండగా కారు ఆశ్రమం గేటును ఢీ కొట్టడంతో…ఆ శబ్దానికి చుట్టుపక్కల వారంతా నిద్రలేచి అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కారును వదిలేసి అక్కడ ఉన్న ద్విచక్రవాహనం తీసుకుని నిందితుడు పరారయ్యాడు. అక్కడి నుంచి బయలుదేరి నిందితుడి చిన్నమ్మ ఉండే తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూర్ కు వచ్చాడు.
ఆశ్రమంలోని సిబ్బంది పోలీసులకు సమాచారం అందిచటంతో ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు నిందితుడి ఫోటోను అన్ని పోలీసు స్టేషన్లకు వాట్సప్ చేశారు. నిందితుడు తెలంగాణలోని తానూర్ వచ్చాడని తెలుసుకుని స్ధానిక ఎస్ఐ గుడిపెల్లి రాజన్నకు సమచారం ఇచ్చి ఫోటో పంపించారు.ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి ఆదివారం తానూర్ మండలం ఏల్వి గ్రామానికి రావటంతో పోలీసులు గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సాయినాథ్ లింగాడేను గుర్తించిన స్ధానికులు పోలీసులకు సమచారం ఇచ్చారు.
అప్పటికే లింగాడే చేసిన హత్యల గురించి సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రాజన్న, ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉన్న లింగాడేను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్దనుంచి లాప్ టాప్, 70 వేల రూపాయలనగదు, కొన్ని బంగారు ఆభరణాలు, మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని ధర్మాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు తానూర్ వచ్చి లింగాడేను అదుపులోకి తీసుకున్నారు. పదేళ్లక్రితం ధర్మాబాద్ ఠాణా పరిధిలో జరిగిన ఒక హత్యకేసులోకూడా లింగాడే నిందితుడని పోలీసులు వివరించారు.