తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి. వీటి ఫలితాలు ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 2024లో మార్చి 19కి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవగా, వాటి ఫలితాలు ఏప్రిల్ 24న రిలీజ్ అయ్యాయి.
తెలంగాణలో ఇంటర్ పరీక్షలకు 9,96,971 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వారిలో 98 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రధాన సబ్జెక్టుల పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ఇప్పటికే షురూ అయింది.
మూల్యాంకనం ఎటువంటి లోపాలు లేకుండా జరిగేందుకు అధికారులు పటిష్ఠంగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో 19 స్పాట్ వ్యాల్యుయేషన్ సెంటర్లలో మూల్యాంకనం జరుగుతుంది. జవాబు పత్రాలను 14,000 మంది దిద్దుతారు.
ఒక్కో లెక్చరర్ ఒక్కో రోజు 40 జవాబు పత్రాల చొప్పున దిద్దుతారు. కాగా, రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ ఏడాది మార్చి 5 నుంచి 25 వరకు జరిగాయి. అంతకుముందు ఫిబ్రవరి 3 నుంచి 22 వరకు ప్రాక్టికల్స్ పరీక్షలను నిర్వహించారు. జనవరి 29న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామ్ జరిగింది.