ఐటి గ్రిడ్ సంస్థలో కొనసాగుతున్న సోదాలు : డేటా ఎవరు చేరవేశారు?

హైదరాబాద్ : మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఐటీ గ్రిడ్ కంపెనీలో సైబరాబాద్ పోలీసులు సోదాలు కొనసాగుతున్నాయి. ఏపీకి సంబంధించిన డేటాను ఐటీ గ్రిడ్కు ఎవరు చేరవేశారనే దానిపై తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరోవైపు తెలంగాణకు చెందిన డేటాను సైతం ఐటీ గ్రిడ్ దొంగిలించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మాదాపూర్ పోలీసులు ఐదుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. టీడీపీకి సంబంధించిన చాలా యాప్స్కు ఐటీ గ్రిడ్ సంస్థ అనుసంధానంగా వ్యవహరిస్తోంది.
టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న బ్లూఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీతో పాటు, ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్పై తెలంగాణ పోలీసులు మార్చి 2 శనివారం రాత్రి దాడులు చేశారు. ఏపీలోని లబ్ధిదారుల డాటా మొత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీ కార్యాలయంలో ఉందన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బ్లూ ఫ్రాగ్ మొబైల్ టెక్నాలజీ కార్యాలయాల్లో శనివారం అర్ధరాత్రి వరకు తనిఖీలు నిర్వహించారు.