డేటా వార్ : ఐటీ గ్రిడ్ ఉద్యోగులను ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశం

ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు(సోమవారం, మార్చి 4) ఉదయం పదిన్నరకు కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు

  • Published By: veegamteam ,Published On : March 3, 2019 / 03:10 PM IST
డేటా వార్ : ఐటీ గ్రిడ్ ఉద్యోగులను ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశం

Updated On : March 3, 2019 / 3:10 PM IST

ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు(సోమవారం, మార్చి 4) ఉదయం పదిన్నరకు కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు

ఐటీ గ్రిడ్ కంపెనీ ఉద్యోగులను రేపు(సోమవారం, మార్చి 4) ఉదయం పదిన్నరకు కోర్టులో హాజరుపర్చాలని హైకోర్టు ఆదేశించింది. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ ఉద్యోగులు కనిపించడం లేదంటూ  హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు.. ఉద్యోగులను తమ ముందు హాజరుపర్చాలని ప్రతివాదులను ఆదేశించింది. నలుగురు సహచర ఉద్యోగులను  పోలీసులు అక్రమంగా నిర్బంధించారని ఐటీ గ్రిడ్‌ సంస్థకు చెందిన అశోక్‌ తెలంగాణ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. రేగొండ భాస్కర్‌, ఫణి కడలూరి, గురుడు చంద్రశేఖర్‌,  విక్రమ్ గౌడ్‌ను పోలీసులు నిర్బంధించారని పిటిషన్‌లో తెలిపారు. నలుగురు ఉద్యోగులను వెంటనే కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఇవాళ, రేపు హైకోర్టు  సెలవులు ఉన్న నేపథ్యంలో ఇంట్లోనే విచారణ జరపాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్ సంస్థ కార్యాలయంలో సైబరాబాద్‌ పోలీసులు శనివారం(మార్చి 2) సాయంత్రం సోదాలు నిర్వహించారు. హార్డ్  డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సంస్థ… టీడీపీకి యాప్‌ తయారు చేసి ఇచ్చిందని, దీనిలో ఓటర్లు, వారి ఆధార్‌ కార్డుల  వివరాలతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల సమాచారం ఉందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఐటీ గ్రిడ్ కార్యాలయంలో తెలంగాణ పోలీసులు తనిఖీలు చేయడం కలకలం చేపింది. డేటా చోరీకి పాల్పడుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు నలుగురు ఉద్యోగులను  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఐటీ గ్రిడ్‌లో పనిచేస్తున్న భాస్కర్ అనే ఉద్యోగి కనిపించడం లేదని యాజమాన్యం ఏపీలోని గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐటీ గ్రిడ్  యాజమాన్యం ఫిర్యాదుతో ఏపీ పోలీసులు భాస్కర్ కోసం హైదరాబాద్ చేరుకున్నారు. డేటా చోరీ కేసులో భాస్కర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలంగాణ పోలీసులు వారికి చెప్పారు.  అయితే భాస్కర్‌ను వెంటనే తమకు అప్పగించాలని ఏపీ పోలీసులు కోరారు. మరోవైపు ఐటీ గ్రిడ్ వ్యవస్థాపకుడు దాకవరపు అశోక్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఏపీకి సంబంధించి డేటా లీక్ కావడంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లీకేజీ వెనుక ఎవరున్నారన్న దారిపై దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీకి చెందిన ఎన్నో యాప్స్‌కు ఐటీ గ్రిడ్ సాంకేతిక సహకారం  అందిస్తున్నట్లు సమాచారం. సేవామిత్ర, మహానాడుతో పాటు టీడీపీ సభ్యత్వ నమోదు డేటాతో కూడిన హార్డ్ డిస్క్‌ను తెలంగాణ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అది ఏపీకి చెందిన  సమాచారం కావడంతో మీరెలా చూస్తారు అని ఏపీ పోలీసులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కేసు తెలంగాణలో నమోదు కావడంతో పాటు తమ రాష్ట్ర సమాచారం కూడా చోరీకి గురైనట్లు  తెలియడంతో దీన్ని తామే విచారణ చేయిస్తామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు. ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు రాష్ట్రాల మధ్య వార్‌గా మారింది. ఇప్పటికే సీఎం  చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.