కేటీఆర్ ప్రకటనతో హైదరాబాద్లో మీసేవా కేంద్రాలకు పోటెత్తిన మహిళలు

hyderabad mee seva centres: హైదరాబాద్ వరద భాదితులకు ప్రభుత్వం అందిస్తున్న.. 10వేల రూపాయల కోసం మహిళలు మీసేవా కేంద్రాలకు క్యూ కట్టారు. సాయం అదని బాధితులు మీసేవా వివరాలు నమోదు చేయాలని మంత్రి కేటీఆర్ ప్రకటించడంతో.. మలక్పేట్లోని మీసేవా కేంద్రాల ముందు ప్రభుత్వ సాయం నమోదు కోసం భాదితులు బారులు తీరారు. అయితే కొన్ని మీసేవా సెంటర్లలో.. సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వివరాల నమోదుకు 100 నుంచి 150 రూపాయలు వసూలు చేస్తున్నారు.
హైదరాబాద్ మహానగరాన్ని గత నెలలో భారీ వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. వందేళ్లలో ఎప్పుడూ లేని విధంగా వానలు నగరాన్ని ముంచెత్తాయి. చాలా కాలనీలు నీట మునగడంతో నగరవాసులు నరకం చూశారు. ప్రజలు ఎంతో నష్టపోయారు. అలాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది.
వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం, ఇల్లు పూర్తిగా దెబ్బతింటే రూ.లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటికే ఎంతో మంది వరద సాయం అందుకున్నారు. అయితే చాలా కాలనీల్లోని వరద బాధితులకు మాత్రం ఇప్పటికీ సాయం అందలేదు. వారంతా ఆందోళనలు చేస్తున్నారు. తమకు రావాల్సిన డబ్బును కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ అధికారులు కాజేశారని ఆరోపిస్తున్నారు. కొందరికి మాత్రమే ఇచ్చారని… అసలైన వరద బాధితలను పట్టించుకోలేదని వాపోతున్నారు. కొంత మందికే డబ్బులు ఇచ్చి.. మిగతా వారికి ఎందుకు ఇవ్వడం లేదని జీహెచ్ఎంసీపై వరద బాధితులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో.. మా కాలనీకి వచ్చినప్పుడు.. మీ సంగతి తేలుస్తాం.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
https://10tv.in/hyderabad-floods-public-outrage-over-political-leaders/
ఈ క్రమంలో వరద సాయంపై శనివారం(నవంబర్ 14,2020) మంత్రి కేటీఆర్ మరింత క్లారిటీ ఇచ్చారు. వరదసాయం కింద రాష్ట్రవ్యాప్తంగా 4,75,871 కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.475 కోట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఇప్పటికీ వరద సాయం అందని వారు మీ-సేవ సెంటర్లలో పేర్లు, ఇంటి వివరాలు, ఆధార్ నంబర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సాయం అందిస్తారని చెప్పారు కేటీఆర్. అర్హులైన వారికి నేరుగా బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తారని తెలిపారు. మంత్రి ప్రకటనతో సాయం అందని వరద బాధితులు మీసేవా కేంద్రాలకు క్యూ కట్టారు.