మహా శివరాత్రి : శివాలయాల్లో భక్తుల రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : March 4, 2019 / 02:40 AM IST
మహా శివరాత్రి : శివాలయాల్లో భక్తుల రద్దీ

Updated On : March 4, 2019 / 2:40 AM IST

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివాలయాలు శివనామస్మరణంతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. క్యూలైన్లలో బారులు తీరి నిల్చున్నారు. శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. నదులలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. శివరాత్రి సందర్భంగా కృష్ణానది, గోదావరి నదులలో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు.

సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ రాజన్న క్షేత్రంలో శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర స్నానాలు ఆచరించి రాజన్న దర్శనం కోసం బారులు తీరారు. భక్తులు భారీగా తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఉదయం 7 గంటలకు టీటీడీ తరపున రాజన్నకు  పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఇక 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి మహా లింగార్చన జరుగనుంది. రాత్రి 11 గంటల తర్వాత లింగోద్భవ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

శ్రీశైలంలో వైభవోపేతంగా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. రాజమండ్రిలో ఘనంగా మహా శివరాత్రి వేడుకలు మొదలయ్యాయి. గోదావరి పుష్కరాల రేవులో పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు తరలివస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేస్తున్నారు.