తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. బీహార్లో రెండుస్థానాలు, తెలంగాణ, మహారాష్ట్రలోని ఒక్కోస్థానానికి జూన్ 7న ఎన్నికలు జరుగనున్నాయి.
ఈ నాలుగు స్థానాల ఎన్నికకు సంబంధించి మే 21వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 28వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి 29న పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 31 కాగా.. జూన్ 7వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ఎన్నికల ప్రక్రియ జూన్ 10వ తేదీ నాటికి ముగుస్తుంది. తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు తన పదవికి రాజీనామా చేసి మల్కాజిగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు.