తెలంగాణలో పబ్జీ పిచ్చి: ప్రాణం తీసుకున్నాడు

పాపులర్ ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ పబ్ జీ(PUBG) కి బానిసలైపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ గేమ్ ఆడి పలువురు ప్రాణాల మీదకి తెచ్చుకొంటున్నారు. గేమ్ మాయలో పడి ప్రాణాలను సైతం తీసుకోవడం కలవరపెడుతున్న విషయం. తెలుగురాష్ట్రాలలో కూడా చాలామంది యువత పబ్ జీ గేమ్ మాయలో పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు.
ఇటీవల తెలంగాణలో ఓ వ్యక్తి పబ్ జీ కారణంగా నరాలు పట్టి చనిపోయిన ఘటన మరువకముందే హైదరాబాద్లో పబ్జీ గేమ్ అడిక్షన్కు మరో విద్యార్ధి బలయ్యాడు. మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో పబ్జీ గేమ్ ఆడొద్దని మందలించినందుకు 10వ తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. విష్ణుపురి కాలనీకి చెందిన పురోహితుడు కె.భరత్రాజా, ఉమాదేవి దంపతుల కుమారుడు సాంబశివ 10వ తరగతి చదువుతున్నాడు. అయితే సాంబశివ ఇటీవలికాలంలో తరచూ పబ్జీ గేమ్ను ఆడుతున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే రోజంతా అదేపనిగా ఆడితే ఆరోగ్యానికి ప్రమాదం అని, చదువులో కూడా వెనుకపడిపోతావంటూ కుటుంబ సభ్యులు అతనిని హెచ్చరించారు. బుధవారం(3 మార్చి 2019) పరిక్ష రాయాలని, ఆట పక్కనబెట్టి చదువుకోవాలని తల్లి మందలించడంతో కలతచెందిన సాంబశివ.. గదిలోకి వెళ్లి మెడకు టవల్తో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.