ఆర్టీసీ జేఏసీ సమావేశం : మరోసారి తెలంగాణ బంద్ !

మరోసారి తెలంగాణ బంద్కు పిలుపునివ్వాలని ఆర్టీసీ జేఏసీ ఆలోచిస్తోంది. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం మరింత ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహరచనలు చేస్తున్నారు. రోడ్ల దిగ్భందనం, జైల్ భరోతో పాటు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని భావిస్తున్నారు జేఏసీ నేతలు. 2019, నవంబర్ 10వ తేదీ ఆదివారం ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో నాయకులు భేటీ అయ్యారు. చలో ట్యాంక్ బండ్లో జరిగిన పరిణామాలు, తదితర వాటిపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతోంది.
37వ రోజులుగా సమ్మె కొనసాగుతున్న కార్మికులు… 2019, నవంబర్ 09వ తేదీ శనివారం చలో ట్యాంక్బండ్తో కదంతొక్కారు. ఆందోళనలతో అట్టుడికించారు. సమ్మెలో భాగంగా చేపట్టిన వివిధ రూపాల నిరసనలు పూర్తవడంతో ఇంకా ఏం చేయాలన్న దానిపై కార్మిక సంఘాల జేఏసీ దృష్టిపెట్టింది. తదుపరి కార్యాచరణను ప్రకటించేందుకు ప్రతిపక్ష నేతలతో భేటీ అయ్యింది.
ఈ సమావేశంలో చలో ట్యాంక్బండ్ పరిణామాలను చర్చించడంతోపాటు.. భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనుంది. పోలీసులు కార్మికులపట్ల కఠినంగా వ్యవహరించారంటున్న ఆర్టీసీ జేఏసీ.. దానిని తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతోపాటు హైకోర్టు సూచించినా ప్రభుత్వం స్పందించడంలేదన్న కారణాలతో మరోసారి రాష్ట్ర బంద్ నిర్వహించాలనుకుంటోంది. పలు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటంతో సమావేశంలో ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
Read More : ఆర్టీసీ సమ్మె @ 37 రోజు : అఖిలపక్ష నేతలతో జేఏసీ సమావేశం