Stock Food: భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు.. 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు..
అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసింది.

Stock Food : పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బోర్డర్ లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరు దేశాల సైనికులు అలర్ట్ అయ్యారు. అటు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ ను రెచ్చగొట్టేలా కాల్పులు జరుపుతోంది.
పహల్గాం ఉగ్రదాడితో యావత్ భారతం రగిలిపోతోంది. ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను (పీవోకే) పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో భారత్కు సూచనలు వినిపిస్తున్నాయి. దీంతో ఏ క్షణమైనా భారత్ దాడి చేయొచ్చనే భయం పీవోకే యంత్రాంగాన్ని వెంటాడుతోంది. దీంతో పీవోకే యంత్రాంగం అలర్ట్ అయ్యింది. స్థానిక ప్రజలకు కీలక సూచన చేసింది. ఆహారం నిల్వ చేసుకోవాలంటూ స్థానికులను అప్రమత్తం చేసింది.
2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకోవాలని లైన్ ఆఫ్ కంట్రోల్(ఎల్ వోసీ) సమీపంలో ఉన్న 13 నియోజకవర్గాల ప్రజలకు సూచనలు చేశారు పీఈవో ప్రధాని చౌదరి అన్వర్ ఉల్ హక్. అలాగే స్థానిక ప్రభుత్వం రూ.100 కోట్లతో ఎమర్జెన్సీ ఫండ్ను ఏర్పాటు చేసింది. ఆహారం, ఔషధాలు, ఇతర కనీస అవసరాల సరఫరాకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసుకునేందుకు ఈ మొత్తాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది.
పీవోకేలో అభివృద్ధిని గాలికొదిలేసిన పాకిస్తాన్.. భారత్ పై విద్రోహ చర్యలకు పాల్పడేందుకు ఉపయోగపడే ప్రదేశంగానే పీఓకేను చూస్తోంది. పీఓకే ప్రధాని అయిన వారు పాక్ చేతిలో కీలుబొమ్మగా మిగిలిపోతున్నారు. ఫలితంగా స్థానికుల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. దివాళ అంచున ఉన్న పాకిస్థాన్ను స్థానిక తిరుగుబాట్లు, వరుస ఉగ్రదాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ భారత్ అనుకూలవాదం వినిపిస్తోంది.
పహల్గాం ఉగ్రదాడిపై భారత సంతతికి చెందిన బ్రిటీష్ ఎంపీ లార్డ్ మేఘనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ వివాదాన్ని పూర్తిగా రూపుమాపాలంటే పాక్ ఆక్రమిత కశ్మీర్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని భారత ప్రభుత్వానికి ఆయన సూచించారు. అదొక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమన్నారు. ఉగ్రవాదులను శిక్షించడానికి, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. భారత్ కఠినంగా జవాబివ్వాలని కోరారు.
Also Read: పాకిస్థాన్ను కోలుకోలేని దెబ్బకొట్టేందుకు భారత్ భారీ వ్యూహం.. ఇక పాక్ ఖేల్ ఖతం.!
పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడి చాలా క్రూరమైనదని ఆవేదన వ్యక్తంచేశారు. కశ్మీర్ వివాదంలో ఈ ఘటనే చివరిది కావాలని ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విశ్వాసం వ్యక్తంచేశారు ఎంపీ లార్డ్ మేఘనాథ్.
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. మాటువేసిన ముష్కరులు దొంగదెబ్బ తీశారు. టూరిస్టులు లక్ష్యంగా కాల్పులు జరిపారు. మతం పేరుతో మారణహోమం సృష్టించారు. హిందువులే టార్గెట్ గా ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది టూరిస్టులే. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు అమాంతం పెరిగిపోయాయి. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని ఆరోపిస్తున్న భారత్.. ఆ దేశంపై పలు ఆంక్షలు విధించింది.