నేపాల్ లో భారత న్యూస్ చానళ్లపై బ్యాన్

భారత్కు వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. మరోవైపు నేపాల్లోని రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందకు చైనా, పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన వెంటనే నేపాల్ లో రాజకీయ సంక్షోభం కూడా తీవ్రతరమైంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే.
ఈ సమయంలో నేపాల్ మరోసారి భారత్పై అక్కసు వెల్లగక్కింది. దూరదర్శన్ మినహా భారత్కు చెందిన అన్ని న్యూస్ చానళ్ల ప్రసారాలను గురువారం సాయంత్రం నుంచి నేపాల్ కేబుల్ ఆపరేటర్లు నిలిపివేశారు. నేపాల్కు వ్యతిరేకంగా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
నేపాల్ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేకుండా చేస్తున్న ప్రచారం హద్దులు దాటింది. ఇది చాలా దారుణం. వెంటనే ఈ చెత్తను నిలిపివేయాలి అని మాజీ ఉప ప్రధానమంత్రి, అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ట అన్నారు.