PM Modi US Tour : అమెరికా పర్యటనలో ప్రధాని మోదీ.. ట్రంప్తో భేటీపైనే సర్వత్రా ఆసక్తి..!
PM Modi US Tour : అమెరికా అధ్యక్షుడు జనవరి 20న రెండవసారి పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా డోనాల్డ్ ట్రంప్ను కలవనున్నారు. ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి, ఎన్ఎస్ఏ మైఖేల్ వాల్ట్జ్లను కూడా కలవనున్నారు.

Narendra Modi US visit
PM Modi US Tour : అభివృద్ధి లక్ష్యంగా భారత ప్రధాని మోదీ అడుగులు వేస్తున్నారు. వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ వంటి రంగాలలో ప్రపంచ దేశాల భాగస్వామ్యాన్ని విస్తరించడంపై మోదీ ఫోకస్ పెట్టారు.
ఫ్రాన్స్లో రెండు రోజుల పర్యటన విజయవంతమైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రస్తుతం వాషింగ్టన్ చేరుకున్న ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడి అతిథి గృహంలో భారతీయ-అమెరికన్ ప్రవాసులు ఘన స్వాగతం పలికారు.
ట్రంప్, మోదీల భేటీపైనే అందరి చూపు :
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం రాత్రి 2:35 జరగనున్న ట్రంప్తో మోదీ భేటీ కానున్నారు. ఇద్దరి దేశాధినేతల మధ్య భేటీపై యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. వీసా నిబంధనల సడలింపు, వాణిజ్యం, సాంకేతిక పరిజ్ఞానం, ద్వైపాక్షిక సంబంధాలపై ఇరు నేతల మధ్య కీలక చర్చలు జరిపే అవకాశం కనిపిస్తోంది.
మస్క్తో ప్రధాని భేటీ అయ్యే అవకాశం :
రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరు నేతలు భేటీ కానున్నారు. ప్రధాని మోదీ ట్రంప్ సహా టెస్లా అధినేత ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి, ఎన్ఎస్ఏ మైఖేల్ వాల్ట్జ్ సహా ఇతర ప్రముఖులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. భారత్లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటుపై మస్క్తో ప్రధాని మోదీ చర్చకు వచ్చే అవకాశం ఉంది.
స్టార్లింక్ సర్వీసులపై టెస్లా బాస్ మస్క్తో చర్చించే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలు పేర్కొన్నాయి. ట్రంప్తో భేటీ సందర్భంగా ప్రధాని మోదీ కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అమెరికా-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ప్రధాని మోడీ తన అమెరికా పర్యటనను ఇప్పటికే అమెరికా జాతీయ నిఘా విభాగ అధ్యక్షులు తులసి గబ్బర్డ్తో సమావేశంతో ప్రారంభించారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలు చర్చించారు. ఉగ్రవాదం, ఉద్భవిస్తున్న ముప్పులను ఎదుర్కోవడంలో నిఘా సహకారాన్ని పెంచడంపై ఇద్దరు నాయకుల మధ్య భేటీలో ప్రధాన చర్చకు వచ్చినట్టు తెలిసింది.
గత నెలలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ ఆతిథ్యం ఇస్తున్న నాల్గవ విదేశీ నేత ప్రధాని నరేంద్ర మోదీ. డొనాల్డ్ ట్రంప్ తన రెండవ పదవీకాలం ప్రారంభమైన ఒక నెలలోపు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు, జపాన్ ప్రధాన మంత్రి షిగెరు ఇషిబా, జోర్డాన్ రాజు అబ్దుల్లాII లకు వైట్ హౌస్లో ఆతిథ్యం ఇచ్చారు.