Nepal vs China: ఇండియా బాటలో నేపాల్.. విద్వేష కంటెంట్ మీద చైనాకు గట్టి షాక్
నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు.
Nepal Bans TikTok: భారత ప్రభుత్వం అనంతరం నేపాల్లోని పుష్ప్ కమల్ దహల్ ‘ప్రచండ’ ప్రభుత్వం కూడా చైనాకు గట్టి షాక్ ఇచ్చింది. చైనాకు చెందిన టిక్టాక్ను నిషేధించాలని కేబినెట్ సమావేశంలో నేపాల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు నేపాల్ కమ్యూనికేషన్స్ మంత్రి సోమవారం తెలిపారు. ఇంతకు ముందు కూడా భద్రతా కారణాల దృష్ట్యా భారత్ సహా చాలా దేశాలు టిక్టాక్ను నిషేధించాయి. నేపాల్, చైనాల మధ్య వ్యూహాత్మక సాన్నిహిత్యం పెరుగుతున్న తరుణంలో నేపాల్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
సోమవారం జరిగిన నేపాలీ క్యాబినెట్ సమావేశం సామాజిక సామరస్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతూ చైనా యాజమాన్యంలోని యాప్ను నిషేధించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనే దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. భావప్రకటనా స్వేచ్ఛ ప్రాథమిక హక్కు అయినప్పటికీ, సమాజంలోని పెద్ద వర్గంలో ద్వేషపూరిత ప్రసంగాల ధోరణిని టిక్టాక్ ప్రోత్సహిస్తోందని నేపాల్ ప్రభుత్వం విమర్శించింది. గత నాలుగేళ్లలో నేపాల్లో టిక్టాక్ కారణంగా 1647 సైబర్ నేరాలు నమోదయ్యాయి.
నేపాల్ పోలీస్ సైబర్ బ్యూరో, హోం మంత్రిత్వ శాఖ, టిక్టాక్ ప్రతినిధులు గత వారం ప్రారంభంలో ఈ అంశంపై చర్చించారు. సాంకేతిక సన్నాహాలు పూర్తయిన తర్వాత తాజా నిర్ణయం అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ‘సోషల్ నెట్వర్కింగ్ ఆపరేషన్పై దిశలు 2023’ చట్టాన్ని ప్రవేశపెట్టిన కొద్ది రోజుల్లోనే అమలులోకి వస్తుంది. కొత్త నిబంధన ప్రకారం.. నేపాల్లో పనిచేసే సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లు దేశంలో తమ కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాలి.
ఫేస్బుక్, ఎక్స్ (గతంలో ట్విట్టర్), టిక్టాక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్లు నేపాల్లో తమ కాంటాక్ట్ కార్యాలయాలను తప్పనిసరిగా తెరవాలి. ఈ విషయమై గురువారం నేపాల్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. నేపాల్లో కంపెనీల ప్రతినిధులు గైర్హాజరు కావడం వల్ల తమ వినియోగదారుల సమస్యలను పరిష్కరించడం అధికారులకు కష్టమైందని ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: పాలస్తీనా వివాదంపై మాట్లాడినందుకు హోంమంత్రిని తొలగించిన ప్రధాని