సజీవుల ఫొటోలను మీడియాలో చూపొద్దు: అఫ్ఘాన్లోని తాలిబన్ల ప్రభుత్వం మరో విచిత్ర రూల్
కొన్ని నెలల క్రితమే అఫ్ఘాన్లో షరియాకు అనుగుణంగా ప్రజారవాణా, షేవింగ్, మీడియా, వేడుకలు సహా పలు అంశాలపై తాలిబన్ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది.

సజీవుల ఫొటోలను మీడియాలో పబ్లిష్ చేయొద్దంటూ అఫ్ఘానిస్థాన్లోని తాలిబన్ల ప్రభుత్వం ఇటీవల విచిత్ర రూల్ తీసుకొచ్చింది. ఈ కొత్త నిబంధనలను క్రమంగా అమలు చేయనున్నట్లు తాలిబాన్ నైతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన చేసింది.
జర్నలిస్టులు క్రమంగా ఈ నిబంధనలను పాటించాలని చెప్పింది. కొన్ని ఆఫ్ఘాన్ ప్రావిన్స్లలో తాలిబాన్ నడుపుతున్న మీడియా సంస్థలు ఇప్పటికే ఆయా నైతిక చట్టాలకు అనుగుణంగా సజీవుల చిత్రాలను ప్రసారం చేయడాన్ని నిలిపివేశాయి.
కొన్ని నెలల క్రితమే అఫ్ఘాన్లో షరియాకు అనుగుణంగా ప్రజారవాణా, షేవింగ్, మీడియా, వేడుకలు సహా పలు అంశాలపై తాలిబన్ ప్రభుత్వం నిబంధనలు తీసుకొచ్చింది. తాజాగా, సజీవుల చిత్రాలను చూపకూడదంటూ మీడియాపై విధించిన ఆంక్షలు మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
తఖర్, మైదాన్ వార్దక్, కాందహార్ ప్రావిన్స్లలోని మీడియాకు ఇప్పటికే ఆదేశాలు పంపామని, ప్రజలతో పాటు జంతువుల చిత్రాలను ప్రసారం చేయవద్దని, ప్రదర్శించవద్దని చెప్పామని నైతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైఫ్ ఉల్ ఇస్లాం ఖైబర్ కూడా తెలిపారు. కాగా, అఫ్ఘాన్ నుంచి అమెరికా సైన్యం వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశంలో తాలిబన్లు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.