వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్, మెసేజ్లు పంపలేరు, మే 15 నుంచి అమలు
WhatsApp new privacy policy: వాట్సాప్(whatsapp) యూజర్లకు షాక్ తప్పేలా లేదు. భారత ప్రభుత్వం, సుప్రీంకోర్టు నుంచి ఒత్తిళ్లు వచ్చినా తమ కొత్త ప్రైవసీ పాలసీపై(privacy policy) వాట్సాప్ వెనక్కి తగ్గలేదు. ప్రైవసీ పాలసీకి యూజర్లు అంగీకరించాల్సిందేనని వాట్సాప్ చెప్పకనే చెప్పింది. మే 15న ఈ కొత్త పాలసీని అమలు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ప్రైవేటు మెసేజ్లు, వీడియోలను తాము చూడబోమని, కేవలం బిజినెస్ ఖాతాలకు సంబంధించిన డేటాను మాత్రమే సేకరిస్తామని (అదీ యూజర్ అనుమతితోనే), ఫేస్ బుక్ తో షేర్ చేస్తామని వాట్సాప్ మరోసారి తేల్చి చెప్పింది.
తమ కొత్త పాలసీ గురించి యూజర్లకు సులువుగా సమాచారం చేరవేయడానికి ప్రైవసీ పాలసీ నిబంధనలను ఇన్-యాప్ బ్యానర్గా ఉంచాలని వాట్సాప్ నిర్ణయించింది. అంటే వాట్సాప్ చాట్ల పైభాగాన ఈ కొత్త పాలసీకి సంబంధించిన లింకు ఉంటుంది. దీనిపై క్లిక్ చేస్తే కొత్త పాలసీకి సంబంధించిన సమాచారం యూజర్లకు కనిపిస్తుంది.
భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యక్తిగత గోప్యత పరిరక్షణకు కట్టుబడి ఉంటామని కేంద్ర ప్రభుత్వానికి వాట్సాప్ స్పష్టంచేసింది. ఈ మేరకు నూతన గోప్యతా విధానంపై(privacy policy) తన వైఖరిని తెలియజేస్తూ ప్రకటన విడుదల చేసింది. మే 15 నుంచి కొత్త ప్రైవసీ పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా కొత్త ప్రైవసీ పాలసీకి సంబంధించిన మరింత సమాచారాన్ని బ్యానర్ రూపంలో యూజర్కు కనిపించేలా ప్రదర్శిస్తామంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించని వారికి మే 15 తర్వాత కూడా ఎప్పటిలానే కాల్స్, నోటిఫికేషన్స్ వస్తాయి. కానీ వాళ్లు మెసేజ్లు మాత్రం పంపలేరని స్పష్టం చేసింది.
బిజినెస్ ఖాతాల సమాచారాన్ని మాత్రమే అదీ యూజర్ అనుమతితోనే ఫేస్బుక్తో పంచుకుంటామని వాట్సాప్ తేల్చి చెప్పింది. వ్యక్తిగత సంభాషణలకు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్ట్ ఉంటుందని.. కాబట్టి వాటిని చదవడం, వినడం వాట్సాప్ ఇప్పటి వరకు చేయలేదని, ఇకపై కూడా చేయబోదని వాట్సాప్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
కొద్ది రోజుల క్రితం వాట్సాప్ ప్రకటించిన నూతన గోప్యతా విధానం అనేక విమర్శలకు తావునిచ్చింది. వినియోగదారుల డేటాను ఫేస్బుక్తో పంచుకోనున్నట్లు ఈ నూతన గోప్యతా విధానంలో భాగమని స్పష్టం చేయడమే విమర్శలకు ప్రధాన కారణం. ఆ తర్వాత వాట్సాప్ యాజమాన్యం దిద్దుబాటు చర్యలకు దిగినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. వాట్సాప్పై విశ్వాసం కోల్పోయిన వారు టెస్లాకు చెందిన సిగ్నల్ వైపు మళ్లడం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున సిగ్నల్ రిజిస్ట్రేషన్లు కావడంతో వాట్సాప్ వివరణ ఇచ్చుకుంది. అయినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
ఇతర మెసేజింగ్ యాప్లపైనా వాట్సాప్ అసహనం వ్యక్తం చేసింది. ‘‘యూజర్స్ ఇతర యాప్స్ ఉపయోగించాలా వద్దా అనేది వారి స్వీయ నిర్ణయం. కానీ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ లేకుండా యూజర్స్ డేటాను చూడట్లేదు అని ప్రచారం చేసే యాప్ల గురించి యూజర్స్ ఆలోచించాలి. యూజర్స్ ఎల్లప్పుడూ నమ్మకమైన, భద్రతకు ప్రాధాన్యం ఉన్న యాప్లను ఉపయోగించేందుకే మొగ్గు చూపుతారు’’ అని తెలిపింది.
వాట్సాప్ కొత్త నిబంధనలు యూరప్లో ఒకలా.. భారత్లో మరోలా ఉన్నాయని, దీనిపై స్టే విధించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం, డబ్బు కన్నా వ్యక్తిగత గోప్యతకే ప్రజలు ఎక్కువ విలువిస్తారని.. వాట్సాప్ 2, 3 ట్రిలియన్ల విలువ గల కంపెనీ అయినప్పటికీ వ్యక్తిగత గోప్యత అంతకంటే విలువైందని వ్యాఖ్యానించింది.
అప్పట్లో దీనిపై తమ వైఖరి తెలియజేయాలని వాట్సాప్కు, కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ప్రైవసీ పాలసీలో మార్పులను ఉపసంహరిచుకోవాలని వాట్సాప్ను కేంద్రం ఆదేశించింది. ఏకపక్షంగా చేసిన మార్పులు ఆమోదయోగ్యం కాదని తెలిపింది. తాజాగా దీనిపై వాట్సాప్ వివరణ ఇస్తూ భారతీయ చట్టాలకు కట్టుబడి ఉంటామని కేంద్రానికి తెలిపింది. వాస్తవానికి కొత్త ప్రైవసీ పాలసీ జనవరిలోనే రావాల్సి ఉంది. తీవ్ర విమర్శలు రావడంతో వాట్సాప్ దాన్ని వాయిదా వేసింది.