Strait Of Hormuz: అమెరికా దాడులతో ఇరాన్‌ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత..! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తోంది.

Strait Of Hormuz: అమెరికా దాడులతో ఇరాన్‌ సంచలన నిర్ణయం.. హర్మూజ్ జలసంధి మూసివేత..! భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

Updated On : June 22, 2025 / 9:08 PM IST

Strait Of Hormuz: అణు స్థావరాలపై దాడులతో రగిలిపోతున్న ఇరాన్ ప్రతీకార చర్యగా హర్మూజ్ జలసంధి మూసివేతకు నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ తీర్మానం చేసింది. ఇరాన్ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. హర్మూజ్ జల సంధి ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20శాతం క్రూడాయిల్ సప్లయ్ జరుగుతోంది. భారత్ చమురు దిగుబడులకు ఈ జల సంధి అత్యంత కీలకమైనది. ఇరాన్ నిర్ణయంతో ప్రత్యామ్నాయాలపై భారత్ ఫోకస్ పెట్టింది. అమెరికా, రష్యా నుంచి చమురు దిగుమతికి భారత్ సన్నాహాలు చేస్తోంది.

ఇరాన్, ఒమన్ మధ్య 33 కిలోమీటర్ల పరిధిలో ఇరుకైన పాయింట్ లో ఉన్న ఈ హర్మూజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్ ను, గల్ఫ్ ఆఫ్ ఒమన్ ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. గల్ఫ్ లో ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి ఇంధన ఉత్పత్తి దేశాలు ఆయిల్ ను ఎగుమతి చేసేందుకు అనువుగా ఉన్న ఏకైక సముద్ర మార్గం హర్మూజ్ జలసంధి మాత్రమే.

ప్రస్తుతం ఈ ఒక్క చెక్ పాయింట్ ద్వారానే ప్రపంచవ్యాప్తంగా 20శాతం ఇంధనం సరఫరా అవుతోంది. ఈ హర్మూజ్ జలసంధి ప్రాంతంలోని చాలా ద్వీపాలు ప్రస్తుతం ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. హర్మూజ్ జలసంధి మూసివేత భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేటువంటి చమురు ఎగుమతుల్లో 82శాతం ఆసియా దేశాలకు వెళ్తున్నాయి.

Also Read: ఇరాన్ మీద అమెరికా వేసిన బాంబు ఇదే.. 13,000 కేజీల బరువు.. భూమి లోపల 200 అడుగుల లోతుకి దూసుకెళ్లి..

వీటిలో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలకే ఏకంగా 67శాతం వెళ్తోంది. భారత ముడి చమురులో 90శాతం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ఇందులో 40శాతం హర్మూజ్ జలసంధి నుంచే వస్తుండటంతో ఇది భారత్ కు ఎంతో కీలకం. హర్మూజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. భారత్ కు అవసరమైన చమురు దిగుమతుల్లో 45 నుంచి 50శాతం, సహజవాయువు దిగుమతుల్లో 60శాతం ఈ మార్గం నుంచే వస్తుంది.

ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ వివాదం కారణంగా గ్లోబల్ మార్కెట్ లో చమురు ధరలు బ్యారెల్ కు 65 డాలర్ల నుంచి 70 డాలర్లకు పెరిగింది. ఈ జల సంధి మూసివేతతో ఆ ధర 90 డాలర్లకు పైగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేశారు. అధిక ముడిచమురు ధరలు ఆయిల్ కంపెనీలను నేరుగా ప్రభావితం చేస్తాయని నిపుణులు తెలిపారు. ఇక భారత చమురు దిగుమతి బిల్లు 14 బిలియన్ డాలర్లపైనే పడుతుందని అంచనా వేస్తున్నారు.