Munugode By Poll : ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటిలో భోజ‌నం చేసిన కేటీఆర్‌ .. కుటుంబానికి అండగా ఉంటామని హామీ

ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటిలో భోజ‌నం చేసారు మంత్రి కేటీఆర్‌.. అండగా ఉంటామని హామీ

Munugode By Poll :  ఫ్లోరైడ్ బాధితుడు స్వామి ఇంటిలో భోజ‌నం చేసిన కేటీఆర్‌ .. కుటుంబానికి అండగా ఉంటామని హామీ

Munugode By Poll :

Updated On : October 13, 2022 / 6:17 PM IST

Munugode By Poll : మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో మంచి రసవత్తరంగా మారాయి. ఈక్రమంలో టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. గురువారం (అక్టోబర్ 13,2022) చండూరు వెళ్లిన మంత్రి కేటీఆర్‌… నామినేష‌న్ అనంత‌రం నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని శివ‌న్న గూడెం వెళ్లారు. గూడెంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌… ఆయ‌న యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వామితో కలిసి భోజనం చేశారు. స్వామి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రకటించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

అంశాల స్వామి ఇంటిలోకే కేటీఆర్ మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. నేల‌పై చాప ప‌ర‌చ‌గా దానిపై మ‌రో మంత్రి జ‌గదీశ్ రెడ్డితో క‌లిసి కూర్చున్న కేటీఆర్…అంశాల స్వామితో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ సందర్భంగా త‌న ప‌క్క‌నే కూర్చున్న అంశాల స్వామికి భోజ‌నాన్ని వడ్డించారు.స్వామి ఇంటిని పరిశీలించారు. గతంలో స్వామి ఇంటి నిర్మాణం కోసం రూ.5లక్షలు ఆర్థిక సహాయం చేసిన కేటీఆర్ మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని ఆరా తీశారు. ఆప్యాయంగా పలుకరించారు. దీంతో స్వామి కుటుంబం అంతా సంతోషం వ్యక్తం చేసింది.

కాగా..తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌, టీఆర్ఎస్, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ… కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని హామీ ఇఛ్చారు.

తెలంగాణకు మోడీ చేసిన అన్యాయానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య మునుగోడులో ఎన్నిక జరుగుతుందని అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు మోదీ ఇచ్చారని రాజగోపాల్ చెప్పారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఓటుకు రూ.వేలు ఇస్తామన్న అహంకారంతో రాజగోపాల్ విర్రవీగుతున్నారంటూ మండిపడ్డారు. దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, 2014 ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరికైనా రూ.15లక్షలు వస్తేనే వారు బీజేపీ ఓటు వేయాలని అన్నారు. కేసీఆర్ చేనేత మిత్ర పేరుతో రాయితీలు ఇస్తున్నారని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటాను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం మన్లని ఇబ్బంది పెడుతోందని అన్నారు.