రుతుస్రావంతో మహిళలు భర్తలకు ఆహారం వండితే.. వచ్చే జన్మలో ఆడ కుక్కల్లా పుడతారు!

  • Published By: sreehari ,Published On : February 18, 2020 / 10:31 PM IST
రుతుస్రావంతో మహిళలు భర్తలకు ఆహారం వండితే.. వచ్చే జన్మలో ఆడ కుక్కల్లా పుడతారు!

Updated On : February 18, 2020 / 10:31 PM IST

నెలసరిలో ఉన్న మహిళలు ఎవరైనా తమ భర్తల కోసం ఆహారం వండితే వారు వచ్చే జన్మలో కుక్కల్లా పుడతారని హిందూ ఆధ్యాత్మిక గురువు స్వామి క్రుష్నస్వరూప్ దాస్జీ తన ఉపన్యాసంలో అన్నారు. గుజరాత్ లోని భుజ్ లో స్వామి నారాయణ ఆలయానికి చెందిన  క్రుష్నస్వరూప్ చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. నెలసరిలో ఉన్న మహిళలు వడ్డించిన ఆహారాన్ని తిన్న పురుషులు వచ్చే జన్మలో ఎద్దుల్లా పుడతారని చెప్పారు.

స్వామి నారాయణ్ సెక్షన్ కు చెందిన నార్-నారాయణ్ దేవగదికి చెందినవారి చెబుతుంటారు. భుజ్ నగరంలో ఒక కాలేజీని నడిపే ఆలయంతో ఈయనకు సంబంధం ఉంది. ఆలయంలోని కాలేజీలో చదువుకునే బాలికల్లో 60 మందికి పైగా బాలికలను నెలసరిలో ఉన్నారో లేదో చెప్పాలని కాలేజీ మహిళా సిబ్బంది బలవంతంగా వారితో బట్టలను విప్పించిన ఘటన వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. 

రుతుస్రావం సమయంలో బాలికలు ఎవరూ కాలేజీలోని ఇతరులతో కలిసి భోజనం చేయకూడదు. అలా చేస్తే వారు హాస్టల్ నిబంధనలు అతిక్రమించినట్టు భావిస్తారు. శ్రీ షాహజానాద్ గర్ల్స్ ఇన్సిస్ట్యూట్ (SSGI)కాలేజీకి చెందిన ప్రిన్సిపల్, హాస్టల్ ప్యూన్, హాస్టల్ వార్డెన్ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ స్వామి క్రుష్నస్వరూప్ దాస్జీ.. పిరియడ్స్ సమయంలో మహిళలు వడ్డించిన ఆహారాన్ని పురుషులు ఎవరైనా తింటే మాత్రం వారు వచ్చే జన్మలో ఎద్దుల్లా పుడతారని ఉపదేశంలో తెలిపారు.

‘మీరు నా అభిప్రాయాలను ఇష్టపడకపోతే నేను పట్టించుకోను. కానీ, ఇవన్నీ మా శాస్త్రాలలో (గ్రంథాలలో) రాయడం జరిగింది. రుతుస్రావం ఉన్న మహిళలు ఎవరైనా తమ భర్తకు ఆహారం వండితే, ఆమె వచ్చే జన్మలో కచ్చితంగా ఆడ కుక్కగా పుడుతుంది’ అని గుజరాతీలో స్వామి ఉపన్యాసమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

నెలసరిలో ఉన్న మహిళలు వండిన ఆహారం తినే పురుషులను కూడా స్వామి హెచ్చరించారు. ప్రత్యేకించి మహిళలు నెలసరి సమయంలో నిర్లక్ష్యం పనికి రాదని స్వామి తిట్టిపోశారు. ఆయన దాన్ని తపస్సుతో పోల్చారు. స్వామి దాస్జీ కూడా మగవారిని తప్పనిసరిగా వంట నేర్చుకోవాలని సూచించడం గమనార్హం. రుతుస్రావం అనేది ఒక తపస్సు లాంటిది అని మహిళలు గ్రహించరు. ఇది మన శాస్త్రాలలో రాయడం జరిగిందన్నారు. 

ఈ విషయాలన్నీ మీకు చెప్పడం నాకు ఇష్టం లేదని చెప్పారు. కానీ నేను మిమ్మల్ని హెచ్చరించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. పురుషులు వంట నేర్చుకోవాలి.. ఇది ఇలాంటి సమయాల్లో మీకు సాయపడుతుందని స్వామి దాస్జీ స్పష్టం చేశారు. స్వామి ఉపన్యాసం ఇచ్చిన వీడియో సమయం, ప్రదేశం ఎక్కడో తెలియదు. స్వామినారాయణ ఆలయ వెబ్‌సైట్ ప్రకారం.. 1995 ఏడాదిలో క్రుష్నస్వరూప్ దాస్జీ దీన్ని ప్రారంభించారు. బాలికల కోసం సొంత హాస్టల్ ఉన్న స్వయం-ఆర్ధిక కళాశాల అయిన SSGI, భుజ్ లోని స్వామినారాయణ ఆలయం ట్రస్ట్ నడుపుతోంది.