Vishal Health : విశాల్కు ఏమైంది.. అసలు విషయాన్ని చెప్పిన ఖుష్బూ..
తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Actress Kushboo Clarity About Vishal Health
తమిళ స్టార్ హీరో విశాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో కూడా తన డబ్బింగ్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఆయన నటించిన మదగజరాజా చిత్రం 2013 నుంచి విడుదల వాయిదా పడుతూ ఇప్పుడు 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ను నిర్వహించారు. ఈ ఈవెంట్లో విశాల్ను చూసి అంతా ఆశ్చర్యపోయారు.
ఎంతో ఫిట్గా ఉండే విశాల్.. ఈ ఈవెంట్లో బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడాడు. దీంతో ఆయనకు ఏమైందోనని అంతా ఆందోళనకు గురి అయ్యారు. కాగా.. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు విశాల్ టీమ్ చెప్పింది. డాక్టర్లు కూడా విశాల్ హెల్త్ కండిషన్ పై అప్డేట్ ఇచ్చారు. అయినప్పటికి ఇంకా కొందరిలో అనుమానం పోలేదు. తాజాగా ఆయన స్నేహితురాలు, నటి ఖుష్బూ ఓ ఇంటర్వ్యూలో విశాల్ ఆరోగ్యం పై స్పష్టత ఇచ్చారు.
Sankranthi Movies Heroines : సంక్రాంతి సినిమాలతో ఈ హీరోయిన్స్ ఫేట్ మారుతుందా.. విజయాల బాట పడతారా?
ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్తో బాధపడుతున్నారు. జ్వరంతోనే ఈవెంట్కు వచ్చారని ఖుష్బూ తెలిపింది. అంత జ్వరం ఉన్నప్పుడు ఎందుకు వచ్చావు అని తాను విశాల్ను అడిగినట్లు చెప్పింది. 11 ఏళ్ల తరువాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందుకనే ఖచ్చితంగా రావాలని విశాల్ అనుకున్నాడని, ఈ క్రమంలోనే అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చాడన్నారు.
103 డిగ్రీల జ్వరం ఉన్న కారణంగా వణికిపోయారన్నారు. ఈవెంట్ పూర్తి అయిన వెంటనే విశాల్ ను ఆస్పత్రికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఇప్పుడు ఆయన కోలుకుంటున్నారని ఖుష్బూ చెప్పింది. అయితే.. కొంత మంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం విశాల్ ఆరోగ్యం పై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆమె మండిపడింది. నిజ నిజాలు తెలుసుకోకుండా తేలికగా వదంతులు రాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాల్తో ఉన్న అనుబంధం గురించి..
విశాల్, ఖుష్బూ లు కలిసి పని చేసింది లేదు. అయినప్పటికి వారిద్దరు ఎంతో మంచి స్నేహితులుగా ఉంటారు. వీరి మధ్య ఉన్న ఈ అనుబంధం గురించి ఆమె మాట్లాడుతూ.. మేము కలిసి పని చేయకపోయినా చాలా క్లోజ్గా ఉంటామన్నారు. తొలిసారి ఓ పార్టీలో ఇద్దరు కలుసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆ తరువాత ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. విశాల్ నటించిన సినిమాల్లో కొన్ని తనకు చాలా ఇష్టమన్నారు. ఇక మదగజరాజా కోసం విశాల్ ఎంతో కష్టపడ్డాడని ఖుష్బూ చెప్పారు.
మదగజరాజా సినిమా విషయానికి వస్తే.. సుందర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. అంజలి, వరలక్ష్మి కథానాయికలుగా నటించారు. సంతానం, సోనూసూద్ లు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.