సూపర్ మార్కెట్లో స్టైలిష్ స్టార్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..
కరోనా ఎఫెక్ట్ : తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా సూపర్ మార్కెట్కు వెళ్లిన అల్లు అర్జున్..

కరోనా ఎఫెక్ట్ : తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా సూపర్ మార్కెట్కు వెళ్లిన అల్లు అర్జున్..
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గత కొద్దిరోజులుగా సినీ పరిశ్రమ ప్రముఖులంతా ఇంటికే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరికి వారు తమకు నచ్చిన పనులతో కాలక్షేపం చేస్తున్నారు. ఈ విరామ సమయాన్ని తమ కుటంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న సెలబ్రిటీలంతా కూడా ఇంట్లో తమ రోజు వారీ పనులను ఫోటోలు, వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
కేవలం నిత్యావసర సరకుల కోసం కేటాయించిన సడలింపు సమయంలోనే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఈ క్రమంలో మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబానికి కావాల్సిన సరకుల కోసం సాధారణ వ్యక్తిగా జూబ్లీహిల్స్లోని ఓ సూపర్ మార్కెట్కు వెళ్లాడు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లవ్స్ ధరించి సూపర్ మార్కెట్లో తనకు కావాల్సిన వస్తువులును కొనుక్కుని సాదాసీదాగా వెళ్లిపోయాడు. అయితే బన్నీ సూపర్ మార్కెట్లో సాధారణ వ్యక్తిగా వస్తువులు కొంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో స్టైలిష్ స్టార్ సింప్లిసిటీకి అతడి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
కరోనాపై పోరాటానికి సంబంధించిన కార్యక్రమాలకు తన వంతు బాధ్యతగా అల్లు అర్జున్ 1.25 కోట్లు విరాళం అందిస్తున్నట్లు..ఈ మొత్తంలో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు మరో 50 లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తున్నట్లుగా అల్లు అర్జున్ తెలిపారు. ఇక మరో 25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు అందిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆర్ధిక సహాయం అందించారు అల్లు అర్జున్. కేరళ వరదల్లో చిక్కుకున్నప్పుడు 25 లక్షలు, చెన్నై వరదలు వచ్చిప్పడు బన్నీ 25 లక్షల విరాళాలు అందించిన సంగతి తెలిసిందే.