Krishna Chaitanya : త్రివిక్రమ్ లేకపోతే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమానే లేదు.. ఆ విషయంలో విశ్వక్ అంటే భయపడ్డా..

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.

Krishna Chaitanya : త్రివిక్రమ్ లేకపోతే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమానే లేదు.. ఆ విషయంలో విశ్వక్ అంటే భయపడ్డా..

Director Krishna Chaitanya talk about Gangs Of Godavari Movie and Trivikram

Updated On : May 30, 2024 / 7:26 AM IST

Krishna Chaitanya : విశ్వక్‌ సేన్(Vishwak Sen), నేహశెట్టి (Neha Shetty) జంటగా, అంజలి (Anjali) ముఖ్య పాత్రలో కృష్ణచైతన్య ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari). మే 31న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణ చైతన్య మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలను తెలిపారు.

కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. ఆల్రెడీ ఓకే చేసిన సినిమాలు కొన్ని ఆలస్యం అయ్యాయి. శర్వానంద్ తో ఓ సినిమా మొదలుపెట్టాను. అది కూడా హోల్డ్ లో పడింది. గ్యాప్ ఎక్కువైపోతోంది అనే భయంతో మా గురువు గారు త్రివిక్రమ్ కి చెప్తే విశ్వక్ కి కథ చెప్పమన్నారు. విశ్వక్ కు కథ నచ్చడంతో ఈ సినిమా మొదలైంది. త్రివిక్రమ్ గారు నాకు మొదట్నుంచి సపోర్ట్ చేస్తున్నారు. నేను ఏ విషయమైనా ఆయనతోనే పంచుకుంటాను. షూటింగ్ చేసొచ్చినప్పుడు సీన్స్ ఆయనకు చూపించేవాడిని. నాకు ఏదైనా తప్పుగా అనిపిస్తే కూడా ఆయన్నే అడుగుతాను. త్రివిక్రమ్ గారు లేకపోతే అసలు ఈ సినిమానే లేదు అని అన్నారు.

Also Read : Vijay Antony : జీవితాంతం చెప్పులు వేసుకోకుండా ఇలాగే ఉంటాను.. హీరో షాకింగ్ నిర్ణయం..

విశ్వక్ సేన్ గురించి చెప్తూ.. విశ్వక్ తెలంగాణ అబ్బాయి. సినిమాలో గోదావరి యాసని మాట్లాడగలడా అని ఆ విషయంలో భయపడ్డాను. కానీ 15 రోజులు ఒక ట్యూటర్ పెట్టుకొని, నేర్చుకొని చాలా బాగా మాట్లాడాడు. విశ్వక్ కోసం కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. విశ్వక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ సినిమాకు రీ రికార్డింగ్ చెన్నైలో చేయించాను. అక్కడ సినిమా చూసిన వాళ్ళు కూడా విశ్వక్ పర్ఫార్మెన్స్ గురించే మాట్లాడారు. ఈ సినిమా తర్వాత విశ్వక్ నెక్స్ట్ లెవల్ కి వెళ్తాడు అని తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ గత సంవత్సరం మేలో మొదలయి ఈ సంవత్సరం మే లో పూర్తయింది. ఇందులో 103 రోజులు షూటింగ్ చేసాము అని తెలిపారు.

ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తో పనిచేయడానికి మొదట భయపడ్డాను. ఆయన స్థాయికి నా మాట వింటారా అనుకున్నాను. కానీ ఆయన నేను అడిగినట్టు, నాకు నచ్చినట్టు మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చూసాక నేను అనుకున్న కథ తీయగలిగాను అనిపించింది. క్లైమాక్స్ సీన్స్ మాత్రం ఎమోషన్ తో మెప్పిస్తాయి. మహాభారతంలో.. నా అనేవాడే నీ మొదటి శత్రువు అనే మాట నాకు చాలా ఇష్టం. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కథ కూడా సింగిల్ లైన్ లో చెప్పాలంటే.. నా అనేవాడే నీ మొదటి శత్రువు అనే చెబుతాను అని తెలిపాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఇక చివరగా నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయనతో చల్ మోహన్ రంగ సినిమా సమయంలో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను. కుదిరితే ఆయనతో సినిమా చేయాలని ఉంది అని అన్నారు.