శేఖర్ కమ్ముల సినిమాలే కాదు.. మనసు కూడా స్వచ్ఛమే..
పారిశుద్ధ్య కార్మికులు అందించే సేవలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిరు సాయం..

పారిశుద్ధ్య కార్మికులు అందించే సేవలకు డైరెక్టర్ శేఖర్ కమ్ముల చిరు సాయం..
కరోనా విపత్కర కాలంలో పారిశుద్ధ్య కార్మికులు ఈ ఎండలలో తమ విధులను నిర్వర్తిస్తూ సమాజానికి సేవలందిస్తున్నారు. వారికి కృతజ్ఞత చెబుతూ ఒక నెల రోజుల పాటు వెయ్యిమంది సిబ్బందికి పాలు, మజ్జిగ అందించేందుకు ముందుకు వచ్చారు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిహెచ్ఎమ్సి ఆధికారులతో కలిసి ప్రారంభించారాయన. ప్రతి రోజూ తమ ఏరియాలో తిరిగే వారిని చూస్తే వారందరూ మన ఆరోగ్యం కోసం కష్టపడుతున్నారు.
వారి ఆరోగ్యం కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం అని అన్నారు. నార్త్ జోన్ పరిధిలో పనిచేసే వెయ్యిమంది పారిశుద్ధ్య కార్మికులకు నెల రోజుల పాటు ఈ చలువ చేసే పానీయాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిహెచ్ఎమ్సి నే నిర్వహిస్తుంది. వారే తమ సిబ్బందికి ప్రతిరోజూ ఈ పానీయాలు అందేలా చూసుకుంటారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడతూ: ‘‘పారిశుద్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘం. వారి ఆరోగ్యం గురించి ఆలోచించి దర్శకులు శేఖర్ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను. ఈ రోజు కరోనా నివారణకు స్వీయ నియంత్రణ తప్ప మరో మందు లేదు. మన ప్రియతమ ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు చాలామంది ఇళ్ళు కదలడం లేదు. కానీ కొంతమందిలో ఇంకా మార్పురావాలి. బయటకు అనవసరంగా వచ్చి వ్యాధి వ్యాప్తికి కారణం అవుతున్నారు. వారిని నేను అభ్యర్దిస్తున్నాను. శేఖర్ కమ్ముల వంటి దర్శకులు సమాజానికి సేవలందిస్తున్న వర్కర్స్ పట్ల చూపుతున్న ప్రేమకు ధన్యావాదాలు ’’ అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ: ‘‘నేను మా ఏరియా లో ప్రతి రోజూ పారిశుద్ధ్య కార్మికుల ని చూస్తుంటాను.వారు ఎండలో కష్టపడుతూ ఉంటారు. వారికి థ్యాంక్స్ చెప్పాలనే ఆలోచన తో ఒక వెయ్యి మందికి నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అమిగోస్ సంస్థనుండి అందివ్వాలని నిర్ణయించుకున్నాం. వాటిని మేము పంచడం కంటే వారి సిబ్బంది ద్వారా నే అందించగలిగితే వారికి మరింత గౌరవం ఇచ్చినవారమవుతాం.. అని ఈ పంపిణీని జిహెచ్ఎమ్సి వారికే అప్పగించాం. ఈ ప్రోగ్రాంతో మరికొంత మంది వారికి సహాయంగా నిలుస్తారని ఆశిస్తున్నాను. పారిశుద్ధ్య కార్మికులంటే నా దృష్టిలో దేవుళ్ళతో సమానం. వారికి చేసేది కేవలం కృతజ్ఞతతోనే. ఇప్పుడు మనిషికి మనిషి తోడుండాల్సిన సమయం. ఇది తప్ప వేరే దారిలేదు.’’ అన్నారు.