మీరే చివరి కస్టమర్ కావొచ్చు.. కాజల్ ఎమోషనల్ పోస్ట్!

ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పట్టారాని దు:ఖం.. ఎప్పుడు ఏ వార్త వినవలసి వస్తుందా? మన బంధువులు ఎలా ఉన్నారో? మన పరిస్థితి ఏంటో అనే ఆందోళనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఆర్థికంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. లేటెస్ట్గా అగ్ర కథానాయిక కాజల్ తన హృదయాన్ని కదిలించిన ఓ నిజ జీవిత సంఘటనను ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో షేర్ చేసుకున్నారు.
కరోనా వైరస్ను అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల వల్ల కొందరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ కారణంగా ఓ క్యాబ్ డ్రైవర్ కష్టపడుతున్నాడని, ఇది తెలిసిన తర్వాత తన గుండె పగిలిపోయిందని ఆమె అన్నారు.
‘ఓ క్యాబ్ డ్రైవర్ నా ముందు నిల్చుని ఏడ్చాడు. గత 48 గంటల్లో నేనే తన మొదటి కస్టమర్ అని చెప్పాడు. కనీసం ఇవాళ అయినా నేను సరకులు తీసుకెళ్తానని నా భార్య ఎదరుచూస్తుందంటూ చెప్పుకొచ్చాడని, ఈ వైరస్ మనల్ని అనేక విధాలుగా దెబ్బతీస్తోందని ఆమె అన్నారు. రోజువారి ఆదాయం మీద జీవితం గడిపేవాళ్లు ఈ సమయంలో ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారని, అతడికి రూ.500 ఎక్కువగా ఇచ్చానని, మనలోని చాలా మందికి ఇలా ఇవ్వడం పెద్ద సమస్య కాదు. అంతేకాదు తన గత కస్టమర్ను వదిలిపెట్టిన తర్వాత దాదాపు 70 కిలోమీటర్లు డ్రైవింగ్ చేశానని అతడు చూపించాడు. దయచేసి మీ క్యాబ్ డ్రైవర్లకు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉన్న వారికి కాస్త ఎక్కువ డబ్బులు ఇవ్వండి. ఎందుకంటే.. ఆరోజుకి మీరే వాళ్ల చివరి కస్టమర్ కావొచ్చు’ అని ఆమె స్టోరీ షేర్ చేసుకున్నారు.