మహా ఛాన్స్ : బాలీవుడ్ లోకి కీర్తి సురేష్

మహానటితో సినీ ఇండస్ట్రీలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత చేసే ప్రతి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఏది పడితే ఆ సినిమా ఒప్పుకోవటం లేదు. తెలుగు, తమిళంలో చాలా ఆఫర్స్ వస్తున్నా.. కథ నచ్చలేదంటూ తిరస్కరిస్తున్నారు. ఎంతో మంది నిర్మాతలు బయోపిక్ కథలకు అడిగినా.. సావిత్రి సినిమాకి వచ్చిన పేరును చెడగొట్టుకోవటం ఇష్టం లేక.. నో.. నో అంటున్నారు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సౌత్ నుంచి నార్త్ లో అదృష్టం పరీక్షించుకోబోతున్నారు.
Read Also : రంగు పడుద్ది : హోలీలో మహిళలను వేధిస్తే జైలే!
అమిత్ శర్మ దర్శకత్వంలో భారత మాజీ ఫుట్బాల్ ఆటగాడు, కోచ్ ‘సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం’ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ఆయన సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటించనుంది. జూన్లో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో అజయ్ ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం గా నటించనున్నాడు. బాలీవుడ్ ఎంట్రీతోనే అద్భుత అవకాశాన్ని కొట్టేసిన కీర్తి.. ఈ సినిమాలో రెండు వేర్వేరు పాత్రల్లో నటిస్తుండటం విశేషం. బాలీవుడ్ ఛాన్స్ అంటే ఎగిరిగంతేస్తారు.. అలాంటిది ఒకే మూవీలో రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించటం మాటలు కాదు. అయినా సావిత్రినే మెప్పించింది.. ఇదో లెక్క అంటోంది సినీ ఇండస్ట్రీ.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ త్వరలో మరో తెలుగు చిత్రంతో ప్రేక్షకులని ముందుకు రానుంది. నరేంద్రనాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ప్రస్తుతం సెట్స్పై ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ఇందులో నటీనటుల వివరాలు వెల్లడించారు. రాజేంద్రప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా, కమల్ కామరాజు, భానుశ్రీ మెహ్రాలను ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతుంది.
Read Also : ఐపీఎల్ కొత్త టీజర్: నేను కోహ్లీ కాదు