‘మా’ యుద్ధం: ఓటేసిన చిరంజీవి, నాగార్జున

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఇందులో సీనియర్ నటులు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి పోటీ చేస్తుండగా మరో సీనియర్ నటుడు నరేష్.. శివాజీరాజాకు పోటీగా బరిలోకి దిగుతున్నారు. ఈ ఎన్నికలు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగనున్నాయి. సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలయ్యే అవకాశం ఉంది.
ఇప్పటికే పలువురు అగ్రనటులు ‘మా’ ఎన్నికల్లో వారి ఓట్లను వాడుకోగా.. ఈ ఎన్నికల్లో మొత్తం 745 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. నరేష్ ప్యానెల్కి నాగ బాబు, మహేష్ బాబు, జీవిత, రాజశేఖర్ వంటి స్టార్స్ సపోర్ట్ ఉండగా, శివాజీ రాజాకి మాత్రం మద్దతు పెద్దగా లభించలేదు. వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం నటి హేమ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది. శివాజీ రాజా తరపున మ్యా పానెల్ బరిలో 25 మంది సభ్యులు ఉండగా, నరేష్ ప్యానెల్ బరిలో 23 మంది సభ్యులు ఉన్నారు.
చిరంజీవి, నాగార్జున, పరుచూరి వెంకటేశ్వరరావు, ఎస్వీ కృష్ణారెడ్డి, అలీ, కృష్ణ భగవాన్, సాయికిరణ్, దాసరి అరుణ్కుమార్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు శ్రీకాంత్, ఎస్వీ కృష్ణారెడ్డి, రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, వేణు మాధవ్, బ్రహ్మాజీ, బెనర్జీ, రాజ్ తరుణ్, తనీష్, సాయి ధరమ్ తేజ్, నరేష్, జీవిత, రాజశేఖర్, శివ బాలాజీ, మధుమిత, వెన్నెల కిషోర్, జేడీ చక్రవర్తి, ఝాన్సీ, సునీల్, ప్రియమణి, సుమ, డైరెక్టర్ రవిబాబు సహా పలువురు నటీనటులు ఓటు వేశారు.