Pawan Kalyan – Balakrisha : పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదంటే.. బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ వేడుకల్లో జనసేన మంత్రి..
బాలయ్య 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని అందరూ అనుకున్నారు.

Pawan Kalyan Not Attend to Balakrishna 50 Years Event
Pawan Kalyan – Balakrisha : బాలకృష్ణ 1974లో తాతమ్మ కల సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. బాలయ్య సినీ పరిశ్రమలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నిన్న రాత్రి గ్రాండ్ గా బాలకృష్ణ నట స్వర్ణోత్సవ వేడుకలను నిర్వహించింది. బాలయ్య బాబు 50 ఏళ్ళ నట స్వర్ణోత్సవ వేడుకల ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవితో పాటు వెంకటేష్, శ్రీకాంత్, నాని, ఉపేంద్ర, శివన్న, మోహన్ బాబు, విజయ్ దేవరకొండ, రానా, మంచు మనోజ్, రాఘవేంద్రరావు, బోయపాటి, తమన్.. ఇలా ఎంతోమంది నటీనటులు, డైరెక్టర్స్, సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే ఈ ఈవెంట్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. ఏపీలో కూడా పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో చంద్రబాబు, పవన్ అక్కడ సహాయక కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఏపీలో పరిస్థితులు వర్షాల వల్ల అలా ఉండటంతో బాలకృష్ణ ఈవెంట్ కి సీఎం చంద్రబాబు నేను రాలేకపోతున్నాను అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.
ఇక పవన్ కళ్యాణ్ తరపున జనసేన మంత్రి, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ ఈవెంట్లో కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలం పాటు నటిస్తూ 50 ఏళ్ళ పాటు భారతదేశంలో ఉన్న తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలయ్య గారికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున కృతఙ్ఞతలు. ఈరోజు ఆయనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. ఆయనతో అసెంబ్లీలో కూడా కూర్చుంటున్నాం. 100 ఏళ్ల పాటు ఆయన ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయారు. ఆయన తరపున నేను వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు అక్కడ సహాయక చర్యల్లో ఉన్నారు. బాలకృష్ణ గారికి పవన్ కళ్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియచేసారు. బాలయ్య గారు సినిమా, వైద్య, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను అన్నారు.