Tollywood : సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తున్న దిల్ రాజు మాటలు
ప్రాఫిట్ షేర్ ప్లాన్ గురించి ప్రస్తావించాడు. అలా చేసి ఉంటే.. గేమ్ఛేంజర్ పరిస్థితి ఇంకోలా ఉండేదన్న దిల్ రాజు వ్యాఖ్యలతో.. ఇప్పుడు వాటాల విధానంపై చర్చ మొదలైంది.

Special Focus on Tollywood Dil Raju comments are shaking the film industry
భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్గా మారుతోంది టాలీవుడ్. ఒక్క హిట్ పడితే చాలు.. హీరోలు, డైరెక్టర్లు భారీగా రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు.. సినిమా బడ్జెట్, నిర్మాతల పరిస్థితి గురించి కనీసం ఆలోచించడం లేదనే చర్చ ఎప్పటినుంచో ఉంది. సినిమా బడ్జెట్లో సగం రెమ్యునరేషన్లకే వెళ్లిపోతోందని.. దీంతో బడ్జెట్ కొండెక్కి కూర్చుంటుందని.. ఈ ఎఫెక్ట్ చివరికి ప్రేక్షకుడి మీద కూడా టికెట్ రూపంలో పడుతుందనే చర్చ ఉంది. ఇక పెరుగుతున్న నటులు పారితోషికాలు, బడ్జెట్లతో.. చిన్న, మధ్య తరహా నిర్మాతలు.. ఓ వర్గం హీరోలతో సినిమాలు తీయడానికి కూడా ధైర్యం చేయడం లేదనే చర్చ ఉంది. చిన్న నిర్మాతలు, కొత్త దర్శకులు మంచి కథలు రాసినా.. వీటి కోసం సరైన హీరోలను కన్విన్స్ చేయడం కష్టంగా మారిందనే టాక్ ఉంది. ఇలాంటి చర్చకు దిల్ రాజు వ్యాఖ్యలతో ఆన్సర్ దొరికినట్లు అయింది. ప్రాఫిట్ షేర్ ప్లాన్ గురించి ప్రస్తావించాడు. అలా చేసి ఉంటే.. గేమ్ఛేంజర్ పరిస్థితి ఇంకోలా ఉండేదన్న దిల్ రాజు వ్యాఖ్యలతో.. ఇప్పుడు వాటాల విధానంపై చర్చ మొదలైంది.
ఒక్కటి మాత్రం క్లియర్.. ఇప్పుడు సినిమా సీన్ మారిపోతోంది. మేకింగ్పై డైరెక్టర్లు దృష్టి పెడుతున్నారు. విజవల్గా ఎంత గొప్ప సినిమా తీస్తున్నామనే దానిపై ఫోకస్ చేస్తున్నారు. దీంతో బడ్జెట్లు పెరిగిపోతోంది. పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మార్కెట్ ఉంది కదా అనే ధైర్యం ఒక వైపు.. ఓటీటీలు ఆదుకొంటాయన్న భరోసా మరోవైపు నిర్మాతల్ని నడిపిస్తున్నాయ్. ఐతే ఓ మంచి సినిమా తీయాలంటే చాలా త్యాగాలు చేయాలి. హీరోలు, దర్శకులు పారితోషికాలు తగ్గించుకోవాలి. లేదంటే సినిమా లాభాల్లో వాటాల్లా అందుకొంటే నిర్మాతలకు వెసులుబాటు ఉంటుంది. దిల్ రాజు ఇన్డైరెక్ట్గా చెప్పింది అదే.
పుష్ప 2 కోసం రెమ్యునరేషన్ తీసుకోని బన్నీ, సుకుమార్..
మోహన్ లాల్, ఫృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో మలయాళంలో లూసీఫర్ 2 తెరకెక్కింది. ఈ మూవీ కోసం మోహన్ లాల్, ఫృద్వీరాజ్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు. సినిమా రిలీజ్ అయ్యాక.. బాగా ఆడితే, లాభాల్లో వాటా తీసుకుంటారు. సినిమాపై వాళ్లకు అంత నమ్మకం. దాంతో పాటు ఇప్పుడు ఖర్చు పెట్టే ప్రతీ పైసా సినిమా క్వాలిటీ కోసమే అనేది వాళ్లు నమ్మిన థియరీ. ఇదే ఇప్పుడు హైలైట్ అవుతోంది. ఈ ఫార్ములాను మన దర్శకులు, హీరోలు ఆచరించి తీరాలనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది హీరోలు ఇదే బాటలో నడుస్తున్నారు. పుష్ప 2 కోసం బన్నీ, సుకుమార్ పారితోషికాలు తీసుకోలేదు. లాభాల్లో వాటా అందుకొన్నారు. అది వాళ్లకు ప్లస్ అయ్యింది. రాజమౌళి స్కూల్ కూడా ఇదే. ఆయన తన ప్రతీ సినిమాకూ లాభాల్లో వాటానే అందుకొంటారు. మహేష్ సినిమా కోసం కూడా అదే చేస్తున్నారు.
ముందే పారితోషికాల రూపంలో కాకుండా.. లాభాల్లో వాటా తీసుకుంటే.. సినిమా ఔట్పుట్ మరింత గ్రాండ్గా వచ్చే చాన్స్ ఉంటుంది. అన్నింటికి మించి నిర్మాత సేఫ్ అయ్యే అవకాశాలు ఉంటాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. లూసిఫర్ 2 అనే మూవీ నుంచి టాలీవుడ్ కచ్చితంగా ఈ పాఠం నేర్చుకోవాలనే వాళ్లు మరికొందరు. ఏమైనా దిల్ రాజు వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైనట్లు అయింది.
మెగాస్టార్ చిరంజీవే ఈ పద్ధతి మొదలు పెట్టారనే చర్చ..
సక్సెస్కు కేరాఫ్గా నిలిచిన దర్శకధీరుడు రాజమౌలి.. ఏ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోరు. ప్రాఫిట్ ఇన్ షేర్ విధానమే ఫాలో అవుతారు. ఆయనే కాదు భారీ బడ్జెట్ సినిమాలు తీసే ప్రశాంత్ నీల్, సుకుమార్లాంటి వాళ్లది కూడా ఇదే దారి. భారీ బడ్జెట్ మూవీస్, పాన్ ఇండియా లెవల్ మూవీస్ వస్తున్న కొద్దీ.. తెలుగు ఇండస్ట్రీ డైనమిక్స్ మారుతున్నాయ్. స్టార్ డైరెక్టర్స్ అంతా న్యూ స్ట్రాటజీకి తెర తీశారు. నిజానికి ఇది ఇప్పుడు వచ్చింది కాదు.. తెలుగు పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవే.. ఈ పద్ధతి మొదలు పెట్టారనే చర్చ ఉంది. ఇప్పుడు చాలామంది టాలీవుడ్ టాప్ హీరోలు కూడా.. కథను నమ్మి సినిమా తీస్తున్నారు. అది సక్సెస్ అయితే డైరెక్ట్గా ప్రాఫిట్లో షేర్ తీసుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. ప్రాఫిట్ ఇన్ షేర్ విధానంతో.. సినిమాను హీరో, డైరెక్టర్ మరింత ఓన్ చేసుకుంటారు.. రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. వీటన్నింటికి మించి.. నిర్మాతకు వడ్డీల బాధ తప్పుతుంది. ఫైనాన్షియల్గా పెద్ద రిలీఫ్ లభిస్తుంది.
గత 20 ఏళ్లుగా రెమ్యునరేషన్ తీసుకోని అమీర్..
మిగతా ఇండస్ట్రీలో ఈ విధానం ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కూడా.. గత 20 ఏళ్లుగా రెమ్యునరేషన్ తీసుకోవట్లేదు. తాను కేవలం ప్రాఫిట్లో షేరింగ్ మాత్రమే తీసుకుంటానని.. ఓపెన్గానే చెప్పాడు చాలాసార్లు. దీంతో మూవీ బడ్జెట్ గురించి ఎక్కువగా ఆలోచించకుండా.. మంచి స్క్రిప్ట్ను సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని.. నిర్మాతలకు కూడా ఎక్కువ భారం ఉండదని అంటున్నాడు. తన చాలా సినిమాలు 20 కోట్ల లోపు బడ్జెట్తోనే పూర్తైనట్లు అమీర్ చెప్పాడు చాలాసార్లు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా.. 2023లో విడుదలైన సెల్ఫీ సినిమాకు ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు. ఆ సినిమా సక్సెస్ సాధిస్తేనే రెమ్యునరేషన్ తీసుకుంటానని చెప్పాడు.
సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే.. అది నిర్మాత బాగున్నప్పుడే ! అది జరగాలంటే.. ఇలాంటి విధానాలే కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు దేశం అంతా టాలీవుడ్ వైపే చూస్తోంది. పెద్ద హీరోలందరూ దాదాపుగా పాన్ ఇండియా సినిమానే చేస్తున్నారు.. దీంతో బడ్జెట్ కూడా పెరుగుతోంది. రాబోయే పదేళ్లలో ఈ ట్రెండ్ మరింత పెరిగే చాన్స్ ఉంది. దీంతో షేర్ ఇన్ ప్రాఫిట్ విధానం రాబోయే రోజుల్లో కామన్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.