Pawan Kalyan : ‘పెద్ది’ ఇష్యూ.. పవన్ కళ్యాణ్ ని కలిసిన నిర్మాతలు..
మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సమస్యపై కలిశారు. (Pawan Kalyan)
Pawan Kalyan
Pawan Kalyan : గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో థియేటర్స్ సమస్య చర్చగా మారిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్లు పర్సెంటేజ్ విధానంలో అయితేనే పెద్ది సినిమా రిలీజ్ చేస్తామని అల్టిమేటం జారీ చేసారు. నిర్మాతలు మాత్రం రెంటల్ విధానమే కావాలంటున్నారు. ఇప్పటికే ఈ వివాదం మీద టాలీవుడ్ రెండు వర్గాలుగా చీలి ప్రెస్ మీట్లు పెట్టుకొని ఒకరిపై ఒకరు తిట్టుకున్నారు. ఫిలింఛాంబర్ తో మీటింగ్స్ పెట్టుకున్నారు.
అయినా ఈ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. మెగాస్టార్ చిరంజీవిని కూడా ఈ సమస్యపై కలిశారు. అయితే ఈ సమస్య ఎప్పట్నుంచో ఉన్నా పెద్ది సినిమాని టార్గెట్ చేసే ఇన్నాళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు మళ్ళీ హడావిడి చేస్తున్నారని ఆరోపణలు కూడా వస్తున్నాయి. పెద్ది సినిమాకు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచినా మేము మాత్రం పెంచము అంటూ ఎగ్జిబిటర్లు షాక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెంటల్ విధానమే కావాలి అని కోరుకునే పలువురు నిర్మాతలు తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కలిశారు.
Also Read : Shanmukh Jaswanth : కాబోయే భార్యతో తిరుమలలో షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోలు..
ప్రస్తుతం పవన్ రాజమండ్రి పర్యటనలో ఉండగా అక్కడికే వెళ్లి కలిశారు. ఈ మీటింగ్ లో నిర్మాతలు రవి శంకర్, కిలారు సతీష్, నాగవంశీ, సాహు గారపాటి.. మరికొంతమంది టాలీవుడ్ ప్రముఖులు పవన్ కళ్యాణ్ ని కలిశారు.
ఈ మీటింగ్ లో పర్సెంటేజ్, రెంటల్ విధానం గురించి, సింగిల్ స్క్రీన్స్ కష్టాల గురించి, పెద్ది సినిమా రిలీజ్ గురించి మాట్లాడినట్టు సమాచారం. ఈ సమస్యలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరినట్టు తెలుస్తుంది. అలాగే థియేటర్ల నిర్వహణ వ్యయం పెరగడంతో విద్యుత్ చార్జీల్లో రాయితీ ఇచ్చేవిధంగా ఆలోచన చేయాలని కోరినట్టు సమాచారం. వీటితో పాటు థియేటర్స్ కి సంబంధించిన పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు టాలీవుడ్ నిర్మాతలు. దీంతో నిర్మాతలు చెప్పిన సమస్యలు విన్న పవన్ నిర్మాతలు చేసిన ప్రతిపాదనలను పరిశీలన చేయమని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ను ఆదేశించారు.
