Durga Navaratri Ustavalu: ప్రభుత్వ ఉద్యోగులకు అక్టోబర్ నెలలో 22 రోజులు సెలవులు.. ఎక్కడంటే?
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో దుర్గా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు 11 రోజులు సెలవులు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ సెలవులు కలుపుకొని అక్టోబర్ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు 22 రోజులు సెలవులు రానున్నాయి.
Durga Navaratri Ustavalu: ఈ ఏడాది దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఉత్సవాల ఏర్పాట్ల నిమిత్తం దుర్గా పూజ మండపాల నిర్వాహకులతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశం నిర్వహించి వారికి వరాల జల్లు కురిపించారు.
ప్రతీయేటా ప్రభుత్వం దుర్గాదేవి మండపాల ఏర్పాటుకు రూ.50వేలు ఇచ్చేది. ప్రస్తుతం వాటిని రూ. 60వేలకు పెంచారు. మండపాల విద్యుత్ బిల్లుల్లో ఇచ్చే రాయితీని కూడా 50శాతం నుంచి 60శాతానికి పెంచారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు. సెప్టెంబరు 30 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు ప్రకటించారు. ప్రతీయేటా దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలకు బెంగాల్ సర్కారు ఏటా సెలవులు ప్రకటిస్తుంది.
అయితే ప్రస్తుతం 11 రోజులు ప్రభుత్వ సెలవులను ప్రకటించింది. గత ఏడాది అక్టోబర్ నెలలో ప్రభుత్వ సెలవులకు తోడు మొత్తం 16 సెలవులు వచ్చాయి. ప్రస్తుతం ఈ అక్టోబర్ నెలలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులకు 11రోజులు దసరా ఉత్సవాల సెలవులతో పాటు కాళీ పూజ, దీపావళి వంటి పండుగలు, సాధారణ సెలవులతో పాటు మొత్తం 22 రోజులు సెలవులు రానున్నాయి.