దేశంలోనే ఫస్ట్ : తిరువనంతపురం మేయర్ గా 21 ఏళ్ల యువతి

country’s youngest Mayor from Thiruvananthapuram ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫంట్ (LDF) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 941 స్థానాలకు గాను ఎల్డీఎఫ్ 516పైగా స్థానాల్లో విజయకేతనం ఎగరేసి పూర్తి ఆధిక్యతను కనబర్చింది. కేరళ రాజధాని తరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ముడవన్ ముగల్ వార్డు నుంచి సీపీఎం తరఫున పోటీ చేసి 21ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ విజయం సాధించిన తెలిసిందే. విపక్ష కూటమి నుంచి సీనియర్ అభ్యర్థి బరిలో నిలిచినప్పటికీ.. ఆర్యా రాజేంద్రన్ విజయం సాధించి అందరి దృష్టిని ఆకర్షించారు.
అయితే, ఇప్పుడు అనూహ్యంగా తిరువనంతపురం మేయర్ గా 21 ఏళ్ల ఆర్యా రాజేంద్రన్ ను ఎంపిక చేసినట్లు ఎల్డీఎఫ్ పెద్దలు శుక్రవారం ప్రకటించారు. యువతరానికి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో సీపీఎం నేతలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం పూర్తయితే… కేరళలోనే కాకుండా దేశంలోనే మేయర్ అయిన అత్యంత పిన్నవయస్కురాలిగా ఆర్య.. చరిత్ర సృష్టించనున్నారు. కాగా,23 ఏళ్లకే అలహాబాద్ మేయర్ పదవి చేపట్టి దేశంలోనే అత్యంత చిన్నవయస్సులో మేయర్ పీఠాన్ని అధిరోహించిన వ్యక్తిగా నిలిచిన అభిలాష గుప్తా నంది.. రికార్డును ఇప్పుడు ఆర్య బ్రేక్ చేసింది.
ఆర్య రాజేంద్రన్ ప్రస్తుతం.. తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్పీ-మేథమెటిక్స్ సెకండ్ ఇయర్ చదవుతోంది. ప్రస్తుతం బాలసంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా కూడా ఆర్య పనిచేస్తున్నారు. అంతేకాకుండా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా కూడా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో పార్టీ వ్యవహారాల్లోనూ ఆర్య కీలకంగా పాత్ర పోషిస్తున్నారు. ఎన్నికల్లో విజయంపై ఆమె స్పందిస్తూ… రాష్ట్రంలో విద్యాభివృద్ధికి మరింత కృషి చేస్తానన్నారు.