పాకిస్థాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దు.. మోసం చేస్తారు..! భారత్కు బలోచ్ లిబరేషన్ ఆర్మీ సూచన
భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) స్పందించింది.

Baloch Liberation Army
India Pakistan Ceasefire: భారత్ – పాకిస్థాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల విరమణ, తదనంతరం పరిస్థితిపై ఇరు దేశాల మధ్య ఇవాళ కీలక చర్చలు జరగనున్నాయి. హాట్ లైన్ లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)లు పాల్గొననున్నారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
భారత్, పాకిస్థాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) స్పందించింది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. పాకిస్థాన్ ఊసరవెల్లి మాటలు నమ్మొద్దని సూచించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా పాకిస్థాన్ గురించి అప్రమత్తంగా ఉండాలని పరోక్షంగా భారత్ కు బీఎల్ఏ సూచించింది. పాకిస్థాన్ నుంచి వినిపించే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రవచనాలు కేవలం మోసం. అవి ఒక యుద్ధ వ్యూహంలో భాగమని పేర్కొంది. తాత్కాలిక ఉపాయం మాత్రమే అని బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేర్కొంది.
పహల్గాం ఉగ్రదాడి తరువాత సరిహద్దుల్లో ప్రతీరోజూ పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే, భారత్ బలగాలు వారికి ధీటైన సమాధానం ఇచ్చాయి. పాక్ ఆర్మీ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తరువాత కూడా శనివారం అర్ధరాత్రి పాకిస్థాన్ ఆర్మీ సరిహద్దుల్లో కాల్పులకు తెబడింది. అయితే, ఆదివారం రాత్రి ఎలాంటి కాల్పులు జరగలేదని భారత ఆర్మీ పేర్కొంది. ‘‘జమ్మూ కశ్మీర్, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి చాలావరకు ప్రశాంతంగా ఉంది. ఎటువంటి సంఘటనలు జరిగినట్టు నివేదించలేదు. ఇటీవలి రోజుల్లో ఇది మొదటి ప్రశాంతమైన రాత్రి’ అని సైన్యం తెలిపింది.