CJI NV Ramana : వాఘా బోర్డర్ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ రికార్డు
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ వాఘా సరిహద్దును సందర్శించారు. జలియన్ వాలాబాగ్ మారణకాండ 103వ వార్షికోత్సవం సందర్భంగా స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.
CJI NV Ramana visited Wagah boarder : జలియన్ వాలాబాగ్ మారణకాండ 103వ వార్షికోత్సవం సందర్భంగా భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి భారత్, పాక్ సరిహద్దుల్లోని వాఘా బోర్డర్ను సందర్శించారు. జలియన్వాలాబాగ్ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం బీఎస్ఎఫ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వాఘా బోర్డర్ను సందర్శించిన తొలి భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ అరుదైన రికార్డును లిఖించుకున్నారు.
గురువారం (ఏప్రిల్ 14,2022)ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ వాఘా బోర్డర్ను సందర్శించారు. ఈ సందర్భంగా భారత సరిహద్దు రక్షక దళం(BSF) గౌరవ వందనాన్ని జస్టిస్ ఎన్వీ రమణ స్వీకరించారు. జస్టిస్ ఎన్వీ రమణ రాక సందర్భంగా బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ..సీజేఐకి స్వాగతం పలకటం పంజాబ్ రాష్ట్రం అంతా ఉప్పొంగిపోయింది అని తెలిపారు.
బుధవారం సాయంత్రం సీజే రమణ స్వర్ణ దేవాలయాన్ని సందర్శించారు. స్వర్ణ దేవాలయాన్ని సందర్శించినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నా కుటుంబంతో కలిసి స్వర్ణ దేవాలయాన్ని సందర్శించాలని నా జీవితకాలం కల అని..అది ఈరోజు నెరవేరింది అని తెలిపారు.
తెలుగు నేలకు చెందిన జస్టిస్ ఎన్వీ రమణ న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి హైకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అంచెలంచెలుగా ఎదిగారు. చివరకు భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆయన అత్యున్నత పదవిని అలంకరించారు. సీజేఐగా పలు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. తాజాగా వాఘా బోర్డర్ను సందర్శించిన తొలి సీజేఐగా రికార్డు పుటల్లోకి ఎక్కారు.