తీహార్ జైలులో లొంగిపోతున్నా.. తల్లిదండ్రులు, భార్య గురించి కీలక వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్
నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు. నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నాను.

delhi cm Arvind Kejriwal
Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో లొంగిపోనున్నారు. మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుండటంతో తాను లొంగిపోతున్నట్లు ప్రజలకు కేజ్రీవాల్ తెలిపారు. తన కుటుంబానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొంసాగుతుందని కేజ్రీవాల్ వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల కోసం సుప్రీంకోర్టు నాకు 21రోజుల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. రేపటికి 21 రోజులు పూర్తవుతుంది. ఎల్లుండి నేను తీహార్ జైలులో లొంగిపోతున్నా. ఈసారి నన్ను ఎన్ని రోజులు, ఎప్పటి వరకు జైల్లో ఉంచుతారో నాకు తెలీదు. దేశాన్ని నిరకుశత్వం నుంచి బయటకు తీసుకెళ్ళేందుకు జైలుకి వెళ్తున్నాను. నన్ను మాట్లాడనీయకుండా భయపెట్టడానికి అనేక విధాలుగా ప్రయత్నించారని కేజ్రీవాల్ అన్నారు.
నేను జైలులో ఉన్నప్పుడు నాకు మందులు ఇవ్వలేదు. నేను 20 ఏళ్లుగా డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. గడిచిన 10 ఏళ్లుగా నేను ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుంటున్నాను. రోజు నా పొట్ట భాగంలో నాలుగు సార్లు ఇంజక్షన్ తీసుకుంటాను. జైల్లో నాకు ఇన్సులిన్ ఇంజక్షన్ ఇవ్వలేదు. నా షుగర్ లెవల్స్ 300-325 వరకు వెళ్లాయి. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే కిడ్నీ, లివర్ దెబ్బతింటాయి. వీళ్లు ఏం కోరుకుంటున్నారో నాకు అర్ధం కావడం లేదు. జైల్లో 50 రోజులు ఉన్నాను. ఆరు కేజీల బరువు తగ్గాను. జైలుకు వెళ్ళినపుడు 70 కేజీల ఉన్నాను. ఇప్పుడు 64 కేజీలు ఉన్నాను. మళ్ళీ బరువు పెరగడం లేదు. శరీరం లో ఇతర వైద్య సమస్యలు ఉండొచ్చు పరీక్షలు చేయాలని వైద్యులు చెబుతున్నారు. యూరిన్ లో కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎల్లుండి మూడు గంటలకు నేను తీహార్ జైలులో లొంగిపోతాను. నేను దేనికి వెనక్కి తగ్గను. ఢిల్లీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. జైలులో నా చింత అంతా ఢిల్లీ ప్రజల గురించే. ఢిల్లీ ప్రజలు సంతోషంగా ఉంటే కేజ్రీవాల్ సంతోషంగా ఉంటాడు.
నేను మీ మధ్య లేకపోయినా ఢిల్లీ ప్రజల అన్ని పనులు జరుగుతాయి. జైలులో లోపల ఉన్నా బయట ఉన్నా ఢిల్లీ ప్రజల పనులు ఆగవు. ఉచిత విద్యుత్, మోహల్లా క్లినిక్, హాస్పిటల్ లో వైద్యం, ఉచితంగా మందులు, మహిళలకు ఉచిత బస్సు సర్వీస్, 24 గంటల కరెంట్ సహా త్వరలో మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సహకారం కొసాగుతుంది. ఢిల్లీ ప్రజల కుటుంబ సభ్యుడిలా నా బాధ్యత నెరవేర్చా. నా తల్లిదండ్రులకోసం దేవుడిని ప్రార్ధించండి.. వారి ఆరోగ్యం బాగాలేదు. మీ ప్రార్దనలతో నా తల్లి ఆరోగ్యం మెరుగుపడుతుంది. నా భార్య సునీత దృఢంగా ఉంది. నా జీవితంలో ప్రతి క్లిష్ట సమయంలో ఆమె నాతో ఉంది. నా కష్ట సమయంలో నాకు ప్రజలంతా మద్దతుగా నిలిచారు. ప్రజల ప్రార్దనలతోనే నేను ఇంకా బతికి ఉన్నాను. ప్రజల ఆశీర్వాదం నన్ను రక్షిస్తుంది. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాలని కేజ్రీవాల్ అన్నారు.