టిక్ టాక్ పిచ్చి: స్నేహితుడిని చంపేశారు

ఇప్పుడు యువతలో ఎక్కువగా కనిపిస్తున్న వెర్రి ఒకటి పబ్జీ అయితే మరొకటి టిక్ టాక్ వీడియోల వెర్రి. ఈ రెండు యాప్లకు యువకులు పూర్తిగా అడిక్ట్ అయ్యిపోతున్నారు. తాజాగా టిక్ టాక్ వెర్రి ఓ యువకుని ప్రాణాలను బలి తీసుకుంది. సల్మాన్, సొహైల్, అమీర్ అనే ముగ్గురు యువకులు ఆదివారం సాయంత్రం కారులో ఇండియా గేట్ వరకు వెళ్లారు. ఎంజాయ్ చేసి తిరిగి ఇంటికి బయల్దేరిన యువకులు.. టిక్ టాక్ వీడియో చేయాలనే ఆలోచనతో కారు నడుపుతున్న సల్మాన్పై నాటు తుపాకీని తలకి గురిపెట్టి టిక్ టాక్ వీడియో చేయాలని అనుకున్నారు.
ఓ నాటు తుపాకీని తలకి గురిపెట్టి సొహైల్ టిక్ టాక్ చేస్తుండగా.. అది ప్రమాదవశాత్తు పేలడంతో సల్మాన్(19) అక్కడికక్కడే చనిపోయాడు. రక్తపు మడుగులో కుప్పకూలిన సల్మాన్ను చూసి వెనక సీట్లో ఉన్న అమీర్, సొహైల్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్నేహితుడి ఇంటికి వెళ్లి రక్తపు మరకల బట్టలను మార్చుకుని సల్మాన్ను సమీపంలోని ఎల్ఎన్జెపీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు.
సల్మాన్ చనిపోయినట్లు తెలుసుకున్న సొహైల్, అమీర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించగా వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. సల్మాన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపారు. దేశరాజధాని ఢిల్లీలోని న్యుజఫారాబాద్కు చెందిన సల్మాన్ ఇంట్లో చిన్నకొడుకు. తండ్రి వ్యాపార వేత్త. ఓ అన్న, అక్క కూడా ఉన్నారు.