మోడీ ఎప్పుడైనా మీతో టీ తాగారా…రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 28, 2020 / 05:27 PM IST
మోడీ ఎప్పుడైనా మీతో టీ తాగారా…రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

Updated On : October 28, 2020 / 5:50 PM IST

Did PM Modi have tea with you all? బిహార్‌‌ను నాశనం చేశారంటూ బీజేపీ, జేడీయూపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. బుధవారం(అక్టోబర్-28,2020)చంపారన్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ..‘బిహార్‌‌లో గత అసెంబ్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ నెలకొల్పుతామని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రజలతో కలసి టీ తాగుతానని ఆయన మాటిచ్చారు. ఇది మీకు గుర్తుందా? ఆయన మీతో చాయ్ తాగారా? అని రాహుల్ ప్రశ్నించారు.



దసరా సందర్భంగా పంజాబ్ లో ప్రధాని దిష్ఠిబొమ్మలను తగులబెట్టడం చూసి తాను ఆశ్చర్యపోయానని రాహుల్ తెలిపారు. ఇది చాలా బాధాకరమని,ఇలాంటివి జరుగకూడదని..మోడీ మన దేశ ప్రధాని అని,కానీ పంజాబ్ రైతులు బాధ ఈ విధంగా ఉందని రాహుల్ అన్నారు. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల గురించి ప్రస్తావిస్తూ… 2006లో నితీష్ కుమార్ బీహార్ కి ఏం చేశారో..ప్రధాని మోడీ ఇప్పుడు పంజాబ్ రైతులకు,దేశంలోని మిగతా ప్రాంతాల రైతులకు అదే చేస్తున్నారని రాహుల్ విమర్శించారు.



బీహార్ లో నిరుద్యోగం గురించి మాట్లాడిన రాహుల్….ఈ రోజుల్లో మోడీజీ ఉద్యోగాల గురించి అస్సలు మాట్లాడటం లేదు. జాబ్స్ కోసం బిహారీలు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వలస వెళ్తున్నారు? మన బిహార్ సోదరులు, సోదరీమణుల్లో ఏమైనా లోపం ఉందా? కాదు. మన సీఎం, ప్రధానిలోనే లోపాలు ఉన్నాయి. మోడీ అబద్ధాలను నమ్మడానికి బిహార్‌‌లో ఎవరూ సిద్ధంగా లేరు. దశాబ్దాలుగా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఎలా పాలించాలో మాకు బాగా తెలుసు. మేమెప్పుడూ అబద్ధాలు చెప్పలేదు అని రాహుల్ వ్యాఖ్యానించారు.



నోట్లరద్దు,లాక్ డౌన్ నిర్ణయాలను మోడీ చివరినిమిషంలో ప్రకటించారని…ఈ ప్రకటనల వల్ల దిగువ మధ్యతరగతి,మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బందులపాలయ్యారని…వ్యాపారవేత్తలకు మాత్రం లాభం చేకూరిందన్నారు.