‘ఇస్రో’ ప్రైవేటీకరణపై శివన్ కీలక వ్యాఖ్యలు
అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అనుమతించిన నేపథ్యంలో భారత అంతరిక్ష పరశోధన సంస్థ(ఇస్రో)ప్రైవేటీకరణపై ఉహాగానాలు జోరందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వార్తలను ఖండిస్తూ.. ఇస్రోను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఇస్రో ఛైర్మన్ శివన్ క్లారిటీ ఇచ్చారు.
ఇస్రో ఏర్పాటు చేసిన ఓ వెబినార్లో శివన్ మాట్లాడుతూ…. అంతరిక్ష పరిశోధనల్లో గమ్యాలను చేరుకోవడంపైనే ఇస్రో దృష్టిపెట్టింది. అభివృద్ధి కార్యకలాపాలు తోడైతే.. తన వనరులను ఉపయోగించుకుని ఇస్రో మరింత సమర్థంగా పనిచేయగలుగుతుంది. అందుకే అందరికీ మళ్లీ చెబుతున్నా. అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టినంత మాత్రాన.. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నట్టు కాదు. ఇది ఓ అపోహ మాత్రమే. ఇంతకు ముందు ఇస్రో ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుందని శివన్ అన్నారు.
భారతీయ అంతరిక్ష రంగంలో ప్రయోగాలు చేపట్టేలా ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం ఇండియన్ నేషనల్ స్పేస్, ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) అనే కొత్త వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో రాకెట్లు- ఉపగ్రహాల తయారీ, ప్రయోగ సర్వీసుల్లో ఇకపై ప్రైవేటు రంగానికి అనుమతి ఉంటుందని శివన్ ఇప్పటికే వెల్లడించారు. ఇంటర్ ప్లానెటరీ మిషన్స్లో కూడా ప్రైవేటు సంస్థలు పాల్గొనవచ్చని తెలిపారు. అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో.. ఇస్రో ప్రైవేటీకరణకు సంబంధం లేదని శివన్ స్పష్టం చేశారు.