Security breach in Lok Sabha: పార్లమెంట్ భద్రతా లోపం అంశంలో 8 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు

భద్రతా లోపంపై దర్యాప్తు చేయడానికి లోక్‌సభ సెక్రటేరియట్ అభ్యర్థనపై హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు

Security breach in Lok Sabha: పార్లమెంట్ భద్రతా లోపం అంశంలో 8 మంది ఉద్యోగులపై కఠిన చర్యలు

Updated On : December 14, 2023 / 12:07 PM IST

పార్లమెంట్ భద్రతా లోపం విషయంలో లోక్‌సభ సెక్రటేరియట్ కఠిన చర్యలు తీసుకుంది. లోక్‌సభ సెక్రటేరియట్ బుధవారం (డిసెంబర్ 13) జరిగిన భద్రతా లోపానికి సంబంధించి ఎనిమిది మంది ఉద్యోగులను సస్పెండ్ చేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఈ భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు సభా కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు చొరబాటుదారులు లోక్‌సభలోకి ప్రవేశించారు. వారు లోపల కలర్ గ్యాస్ వదిలి ఆందోళన కలిగించడంతో వారిని అరెస్టు చేశారు.

సస్పెండ్ అయిన వారు ఎవరు?

లోక్‌సభ సెక్రటేరియట్ సస్పెండ్ చేసిన వారిలో.. రాంపాల్, అరవింద్, వీర్ దాస్, గణేష్, అనిల్, ప్రదీప్, విమిత్, నరేంద్ర ఉన్నారు. పార్లమెంట్‌లోకి చొరబడిన వారిలో ఐదుగురిని అరెస్టు చేశారు. చొరబాటు ఘటనలో ఆరుగురు నిందితులు పాల్గొన్నారని, ఆ ఆరో నిందితుడు లలిత్ ఝా ఇప్పటికీ పరారీలో ఉన్నారని తెలిపారు. రాజస్థాన్‌లోని నీమ్రానాలో ఆరో వ్యక్తి ఉన్నట్టు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం కనుగొంది. అయితే అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్లగానే, అక్కడి నుంచి అతడు పరారీ అయ్యాడు. అతడి కోసం కోసం ప్రత్యేక బృందంలోని రెండు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. త్వరలోనే అతడిని అరెస్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేశారు?
పార్లమెంటు చోరీలో అరెస్టయిన ఐదుగురిని సాగర్ శర్మ (26), మనోరంజన్ డి (34), అమోల్ షిండే (25), నీలం వర్మ (42)గా గుర్తించారు. ఐదవ వ్యక్తిని గురుగ్రామ్ నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అతడి పేరు విశాల్ శర్మ. అదే సమయంలో పోలీసులు కూడా చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద ఈ వ్యవహారంపై కేసు నమోదు చేశారు. అరెస్టు చేసిన వారిని విచారిస్తున్నారు.

భద్రతా లోపంపై విచారణకు కమిటీ ఏర్పాటు
పీటీఐ నివేదిక ప్రకారం.. భద్రతా లోపంపై దర్యాప్తు చేయడానికి లోక్‌సభ సెక్రటేరియట్ అభ్యర్థనపై హోం మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్ ఈ కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. ఇతర భద్రతా సంస్థల సభ్యులు, నిపుణులను కూడా కమిటీలో చేర్చినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. భద్రతా లోపానికి కారణాన్ని కనుగొని, చర్యలను సిఫార్సు చేయడం ఈ కమిటీ పని.