మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా కన్నుమూత

చిన్న వయసులోనే మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా(28) క్యాన్సర్ తో కన్నుమూశారు.

Former Miss India Tripura Rinky Chakma Dies Of Cancer

Rinky Chakma: మాజీ మిస్ ఇండియా త్రిపుర రింకీ చక్మా(28) కన్నుమూశారు. రెండేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడి ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తను ఫెమినా మిస్ ఇండియా శుక్రవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. క్యాన్సర్‌ బారినపడిన ఆమెకు శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని తెలిపింది. రింకీ చక్మా మరణానికి సంతాపం తెలిపింది.

“ఈ క్లిష్ట పరిస్థితుల్లో రింకీ చక్మా కుటుంబ సభ్యులు, స్నేహితులకు మా హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నాం. ఆమె ఆత్మకు శాశ్వత శాంతి కలగాలని కోరుకుంటున్నాం. రింకీ అందం యొక్క ప్రయోజనం, వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ గురించి తెలుసుకునే అవకాశం ఉన్న వారందరూ మిమ్మల్ని చాలా మిస్ అవుతారు”ని ఫెమినా మిస్ ఇండియా పేర్కొంది.

కాగా, తాను క్యాన్సర్ బారిన విషయాన్ని గత నెలలో రింకీ చక్మా బయట ప్రపంచానికి వెల్లడించారు. రెండేళ్ల క్రితం తనకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయిన విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ ద్వారా తెలిపారు. చాలా కాలంగా ఒంటరిగా పోరాటం చేస్తున్నానని, తన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పాలనుకోలేదని పేర్కొన్నారు. తన ఆరోగ్యం గురించి అందరికీ చెప్పే సమయం వచ్చిందని భావించి ఈ విషయాన్ని బయట పెడుతున్నట్టు చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు