HMPV News: హెచ్ఎంపీవీ వల్ల ఎవరెవరికి ముప్పు ఉంటుంది? చిన్నారులకు సోకితే ప్రమాదమా?
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిపై కూడా ఈ వైరస్ అధిక ప్రభావం చూపించవచ్చు.

HMPV
పశ్చిమ బెంగాల్తో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో హెచ్ఎంపీవీ కేసులు నిర్ధారణ కావడంతో దీనిపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
రాజస్థాన్లోని దుంగార్పూర్కు చెందిన రెండు నెలల బాలుడు గుజరాత్లో ఈ వైరస్ బారినపడ్డాడు. బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయి. హెచ్ఎంపీవీ ప్రపంచ వ్యాప్తంగా ఆయా కాలాల్లో వ్యాపించిన వైరస్ అని, చైనాలో ఇటీవల వ్యాప్తి చెందిందని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే తెలిపింది.
ఎవరికి అధిక రిస్క్?
క్లీవ్ల్యాండ్ క్లినిక్ నివేదిక ప్రకారం.. ఈ వైరస్ వల్ల పిల్లలకు అధిక ప్రమాదం ఉంటుంది. అలాగే, 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఈ వైరస్ ప్రమాదకరంగా మారవచ్చు. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిపై కూడా ఈ వైరస్ అధిక ప్రభావం చూపించవచ్చు.
హెచ్ఎంపీవీ అనేది ఒక సాధారణ వైరస్. ఇది సాధారణంగా జలుబు వంటి లక్షణాలను కలిగి ఉంటుంది. చాలా మంది ఇంట్లోనే చికిత్స తీసుకుని కొన్ని రోజుల్లో కోలుకోవచ్చు. అయితే, కొన్నిసార్లు మాత్రం తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది.
చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వారు, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారికి మొదటిసారి హెచ్ఎంపీవీ సోకితే తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. బ్రోన్కియోలిటిస్, న్యుమోనియా వంటి తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు చిన్నారులు, వృద్ధుల్లో కనిపిస్తాయి. పరిశుభ్రత పాటించడం, ఈ వైరస్ సోకిన వ్యక్తులను ముట్టుకోకుండా ఉండడం వల్ల దీని నుంచి తప్పించుకోవచ్చు.
హెచ్ఎంపీవీ లక్షణాలు: దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి, గురక, శ్వాస సరిగ్గా ఆడకపోవడం, దద్దుర్లు.
HMPV : HMP వైరస్ కలకలం.. ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు- మంత్రి సత్యకుమార్ యాదవ్