శని త్రయోదశి ప్రాముఖ్యత

నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి. సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున, స్నేహితులు హనుమాన్, కాలభైరవుడు, ఇతర పేర్లు కృష్ణా, శౌరి, బభ్రు, రోద్రాంతక, సూర్యపుత్ర, కాశ్యపస గోత్రం. నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం. 2020, మార్చి 7 వ తేదీ శనిత్రయోదశిగా భక్తులు జరుపుకుంటున్నారు. శనిత్రయోదశి ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రరీత్యా శని శనివారానికి అధిపతి. ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత, దుష్కృత ఫలితాలను ప్రదానం చేసే అధికారం శనిది. ఆధ్యాత్మిక జ్యోతిష్యం లో శనిని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాత గా చెప్పబడింది. శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది. భౌతిక దృష్టిలో శని క్రూరుడుగా కనపడినా వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్ళిస్తాడు.. ఈశ్వర శాసనం లో శని దండనాధికారి. శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు. నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలా శని దండన విధిస్తాడు.
శనివారానికి స్థితి కారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి , త్రయోదశి కి అధిపతి కామదేవుడు. అంటే శివుడు. అలా శివకేశవుల క్రియలకు శని అధిపతి అయ్యాడు. అందుకే శనిత్రయోదశి శని కి ఇష్టమైన రోజు. త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది. క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత, హాలా హలాన్ని దిగమింగి తన కంఠం లో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి కృతఙ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిథి నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది.
ఆ సమయంలో శివుడు, మన గణాల ప్రకారం 2 గంటల 24 నిమిషాల పాటు ఆనంద తాండవం చేసాడట. ఆ శివ తాండవాన్ని దేవతలందరూ పరవశించి చూస్తూ ఆనందించారని చెప్పబడింది. ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం. ప్రదోషమంటే మునిమాపు వేళ “దోషం” అంటే రాత్రి అని అర్ధం. చంద్రున్ని దోషాకరుడు అని అంటారు. రాత్రికి కారణమయ్యేవాడనే అర్ధం. ప్రదోషమంటే దోష ప్రారంభకాలం. అంటే రాత్రి ప్రారంభ సమయం.
ప్రదోష కాలం లో చేసే పూజా పునస్కారాలు దానధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభఫలితాలనిస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలనిస్తాయి. శని త్రయోదశి ప్రదోషసమయాన శివుడికి అభిషేకం చేయడం చాల విశేషంగా లబిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలనిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. జాతక రీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు. ఏలిననాటి శని, అష్టమ శని, అర్దాష్టమ శని వలన పీడింప బడుతున్నారో అటువంటి వారు ఈ రోజు శని పరిహారాలు చేయడం ఉత్తమం.
నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయడం,శనిత్రయోదశి రోజున ఉపవాసం ఉండడం, రావిచెట్టుకి ప్రదక్షిణాలు చేసి ఆవనూనె తో దీపం పెట్టడం, నువ్వుల నూనెలో ముఖం చూసుకొని ఆ నూనెని దానం చేయడం. నల్ల కాకికి అన్నం పెట్టడం, నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయడం.
శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు (నీలాంజన సమాభాసం,రవిపుత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ సంభూతం,తం నమామిశనైశ్చరం) అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసారులు పఠించటం. వీలైనంతసేపు ఏపని చేస్తున్నా “ఓం నమ:శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. వికలాంగులకు ఆకలి గొన్న జీవులకు భోజనం పెట్టటం
ఎవరివద్ద నుండి ఇనుము,ఉప్పు,నువ్వులు,నువ్వులనూనె చేతితో తిసుకోకుండా వుండటం చేయాలి.
మద్య మాంసాదులను ముట్టరాదు. వీలైనవారు శివార్చన స్వయముగా చేయటము. శనీశ్వర గాయత్రి: “ఓం కాకధ్వజాయ విద్మహే, ఖడ్గ హస్త ధీమహి తన్మోమంత ప్రచోదయాత్” (శనీశ్వర దోషపీడితులు ఈ గాయత్రి మంత్రాన్ని నిత్యం ప్రాత:సమయాన ఎనిమిదిమార్లు జపించవలెను) ఈ విధంగా శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకం, చెడు ఆలోచనలు, రోగాలు, అపమృత్యు దోషము, దారిద్ర్యం తొలగుతాయి. వృత్తిపరమైన సమస్యలు, వివాహం లో ఆటంకాలు, శత్రు భయం, కోర్టు సమస్యలలో ఉన్న వారి సమస్యలు కూడా తొలగుతాయని జ్యోతిష్య పండితులు చెపుతున్నారు.