156 రకాల మందులపై నిషేధం విధించిన కేంద్రం.. ఎందుకంటే?

ఎఫ్‌డీసీ మందులు మానవులకు చాలా ప్రమాదకరమైనవి, అందువల్ల వాటి అమ్మకం, పంపిణీ నియంత్రించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.

156 రకాల మందులపై నిషేధం విధించిన కేంద్రం.. ఎందుకంటే?

Combination Drugs

Govt Bans 156 Medicines : జ్వరం, జలుబు, అలర్జీ, నొప్పులకు తరచూ వినియోగించే 156 రకాల ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్ (ఎఫ్‌డీసీ) ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. తక్షణమే వీటి తయారీ, పంపిణీ, విక్రయాలు నిలిపివేయాలని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మందులు వినియోగించడం వల్ల పలు దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మందుల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఖ్యలో కాంబినేషన్ డ్రగ్స్ ఉన్నాయని డ్రగ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (డీటీఏబీ) సూచనల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేష‌న్‌ను ఆగ‌స్టు 12వ తేదీన కేంద్ర ఆరోగ్య‌శాఖ జారీ చేసింది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940లోని 26ఏ కింద నిషేధిం జారీ చేశారు.

Also Read : Telegram CEO : టెలిగ్రామ్ ఫౌండర్ పావెల్ దురోవ్‌ అరెస్ట్.. కారణం ఏమిటంటే?

ఎఫ్‌డీసీ మందులు మానవులకు చాలా ప్రమాదకరమైనవి, అందువల్ల వాటి అమ్మకం, పంపిణీ నియంత్రించడం ముఖ్యమని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. 2016లో 344 మందుల పంపిణీ, విక్రయాలపై కేంద్రం నిషేధం విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్యానెల్ ప్రకారం.. శాస్త్రీయ డేటా లేకుండా రోగులకు విక్రయిస్తున్నట్లు పేర్కొంది. 2023 సంవత్సరం జూన్ నెలలో 14 ఎఫ్‌డీసీ మందులను నిషేధించింది. తాజాగా 156 మందులపై నిషేధం విధించింది. అరోగ్యానికి ముప్పుతెచ్చేందుకు ఊతమిస్తున్న 34 రకాల మల్టీ విటమిన్ ఔషధాలనుకూడా నిషేధించే యోచనలో కేంద్రం ఉంది. నిషేధించబడిన ఎఫ్‌డీసీలలో మెఫనమిక్‌ యాసిడ్‌, పారా సిటమాల్‌ కాంబినేషన్‌ ఇంజెక్షన్లను సాధారణంగా నొప్పి నివారణకు వినియోగిస్తారు. ఈ కాంబినేషన్‌ మందు వల్ల రోగుల్లో తీవ్రమైన దుష్ఫలితాలు తలెత్తుతున్నట్లు నిపుణులు గుర్తించారు.

Also Read : Generic Medicines : రోగులకు జనరిక్ మందులనే సూచించాలి లేదంటే చర్యలు తప్పవు : డాక్టర్లకు కేంద్రం వార్నింగ్

ఎసిక్లోఫెనాక్‌, పారాసిటమాల్‌ కాంబినేషన్‌ చాలా సాధారణంగా వైద్యులు ప్రిస్ర్కైబ్‌ చేస్తుంటారు. ఈ కాంబినేషన్‌పైనా ప్రభుత్వం నిషేధం విధించింది. మొటిమల చికిత్స, ముక్కు దిబ్బడ, చర్మవ్యాదుల చికిత్సల్లో వాడే ఔషధాలు కూడా ఈ నిషేధిత జాబితాలో ఉన్నాయి. అయితే, కేంద్రం తాజా నిర్ణయంతో సన్ ఫార్మాస్యూటికల్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, టోరెంట్ ఫార్మాస్యూటికల్స్. ఆల్కెమ్ లేబొరేటరీస్‌తో సహా ప్రధాన ఔషధ కంపెనీలపై నిషేధం ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.