గంటన్నర ఆలస్యంగా వచ్చిన రైలు: ప్రయాణికులకు IRCTC నష్టపరిహారం

దేశంలోనే రెండవ ప్రైవేట్ తేజాస్ రైలును భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) అహ్మదాబాద్-ముంబైల మధ్య నడుపుతోంది.
తేజాస్ రైలు బుధవారం(జనవరి 22,2020) న గంటకు పైగా ఆలస్యం కావటంతో ప్రయాణికులకు రూ. 63 వేల నష్టపరిహారం చెల్లించినట్లు భారత రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పోరేషన్(IRCTC) ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ రైలు ఉదయం 6.42 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.10 గంటలకు ముంబై నగరానికి చేరుకోవాలి. గంటన్నర సేపు ఆలస్యంగా 2.36 గంటలకు ముంబై చేరుకున్నట్లు ఐఆర్ సిటిసి అధికారులు తెలిపారు.
ముంబై నగర శివార్లులో భయాందర్, దహిసర్ రైల్వే స్టేషన్ల మధ్య సాంకేతిక సమస్యల కారణంగా రైలు గంటన్నర ఆలస్యంగా నడిచింది. ఈ రైలు ఆలస్యం కారణంగా దరఖాస్తు చేసుకున్న ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.