జనతా కర్ఫ్యూ : జనాల పరుగులు

జనతా కర్ఫ్యూ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. కోవిడ్ – 19 (కరోనా ) వైరస్ విస్తరిస్తున్న క్రమంలో…2020, మార్చి 22వ తేదీ ఆదివారం జనతా కర్ఫ్యూ పాటించాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో జనాలు ఉరుకులు..పరుగులు పెడుతున్నారు. ముందుగానే కూరగాయలు, నిత్యావసరుకులు తెచ్చుకోవాలని ప్లాన్ వేసుకుంటున్నారు.
దీంతో షాపులు, రైతు బజార్లు, పలు దుకాణాల వద్ద రద్దీ నెలకొంది. స్వచ్చందంగా తాము ఇందులో పాల్గొంటామని వ్యాపారస్తులు చెబుతున్నారు. దీంతో ఆదివారం నగరం బోసిపోయి కనిపించనుంది. రైతు బజార్లను బంద్ చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రకటించింది. హోల్ సేల్ మార్కెట్లు బంద్ చేస్తున్నారు. సినిమా హాళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లు ఆల్ రెడీ మూసేసే ఉన్నాయి.
నిత్యావసరాల ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో వాటిని ముందుగానే నిల్వ చేసుకుంటున్నారు. హైదరాబాద్లోని రైతు బజార్లతో పాటు మోండా మార్కెట్, మీరాలం మండి, మాదన్నపేట, ఎన్టీఆర్ నగర్, బోయిన్ పల్లి, అల్వాల్, కొత్తపేట, మెహిదీపట్నం, ఎర్రగడ్డ మార్కెట్ ప్రాంతాలు కొనుగోలు దారులతో కిక్కిరిసిపోతున్నాయి. సాధారణంగా 2-3 రోజుల అవసరాల కోసం కూరగాయాలు కొనుగోళ్లు చేసే వారు..ప్రస్తుతం వారానికి సరిపడా కొనుగోళ్లు జరుపుతున్నారు.
బియ్యం, నూనె, పప్పులు, ఉల్లిగడ్డలను రెండు నెలలకు సరిపడేలా కొనుగోలు చేశారు. ప్రస్తుతం హోటల్స్ బంద్ కావడంతో తోపుడు బండ్లపై టిఫిన్ అమ్మే వారు..చిన్న టిఫిన్ సెంటర్ల యజమానులు ఇడ్లీ, దోశ, పూరీ, వడ, ఇతరత్రా వాటికి అవసరమైన సరుకులను భారీగా కొనుగోలు చేస్తున్నారు.
ఆన్ లైన్ అమ్మకాల్లో ఫుల్ జోష్
ఐటీ కంపెనీలు, ఇతర కంపెనీలు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించడంతో చాలా మంది ఉద్యోగస్తులు ఆన్ లైన్పై దృష్టి సారిస్తున్నారు. నిత్యావసర సరుకులను ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారు. కొంతమంది పాలు, పెరుగు సైతం ఆన్ లైన్లలో కొనుగోలు చేస్తున్నారు. బ్యాచ్ లర్స్ అయితే..మాత్రం..ఆన్ లైన్నే నమ్ముకున్నారు. మొత్తంగా జనతా కర్ఫ్యూతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి.
కోవిడ్ – 19 (కరోనా) కోరలు చాస్తోంది. భారతదేశంలో క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 55 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా
పాజిటివ్ కేసుల సంఖ్య 258కి చేరింది.
Read More : సింగర్ కనికా కపూర్పై కేసు నమోదు : ఏకాంతంలో ప్రముఖులు