Lakhimpur Violence : కేంద్రమంత్రి కుమారుడికి నో బెయిల్..మాజీ ఎమ్మెల్యే అల్లుడు అరెస్ట్
లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును బుధవారం సీజేఎం కోర్టు తిరస్కరించింది. ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ
Lakhimpur Violence లఖింపూర్ ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా బెయిల్ దరఖాస్తును బుధవారం సీజేఎం కోర్టు తిరస్కరించింది. పోలీసుల విజ్ణప్తి మేరకు ఆశిష్ మిశ్రాను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. ఇక,ఇదే కేసులో ఆశిష్ మిశ్రా స్నేహితుడు అంకిత్ దాస్ ను ఇవాళ సిట్ అరెస్ట్ చేసింది.
లఖింపూర్ లోని క్రైమ్ బ్రాంచ్ ఆఫీసులో సిట్ బృందం గంటల పాటు విచారించిన అనంతరం దాస్ ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్థానిక కోర్టు దాస్ ను మూడు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. మాజీ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖిలేశ్ దాస్కు.. అంకిత్ దాస్ అల్లుడు. ఈ నెల 3న అఖింపూర్ ఘటనలో రైతులపైకి దూసుకెళ్లిన ఓ కారు అంకిత్ దాస్ దేనని తెలుస్తోంది.
ఇక, లఖింపుర్ హింసాత్మక ఘటన కేసులో విచారణ వేగవంతం చేసింది ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసింది ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్). ఆశిష్ మిశ్రా,లవ్ కుష్,ఆశిష్ పాండే, శేఖర్ భారతిని పోలీసులు అరెస్ట్ చేశారు. లవ్ కుష్,ఆశిష్ పాండే లు ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు మరియు ఆశిష్ మిశ్రా కుటుంబానికి అనుచరులని తెలుస్తోంది.
అక్టోబర్ 3న లఖింపుర్ ఖేరిలో జిల్లాలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య,కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పర్యటన నేపథ్యంలో హింస చెలరేగిన విషయం తెలిసిందే. టికునియా-బన్బీర్పుర్ సరిహద్దు వద్ద సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తున్న రైతులపైకి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం జరిగిన హింసలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
ALSO READ Manmohan Singh : మన్మోహన్ సింగ్ కు అస్వస్థత..ఎయిమ్స్ కి తరలింపు