Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్.. మెయిన్ గేటును ఢీకొన్న కారు
కారు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? యజమాని ఎవరు? అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడానికి గల కారణాలు ఏంటి?
- ఢిల్లీ అసెంబ్లీ ఆవరణలో కారు కలకలం
- అసెంబ్లీ మెయిన్ గేటును ఢీకొన్న కారు
- అసెంబ్లీ ఆవరణలోకి దూసుకెళ్లే యత్నం
Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. అసెంబ్లీ ఆవరణలోకి ఓ కారు దూసుకెళ్లే యత్నం చేసింది. ఢిల్లీ అసెంబ్లీ మెయిన్ గేట్ ను ఢీకొన్న కారు బారికేడ్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అసెంబ్లీ ఆవరణలోకి కారు ఒక్కసారిగా దూసుకురావడం తీవ్ర కలకలం రేపింది. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కారు ఘటన కలకలం రేపింది. భద్రతాధికారులు అలర్ట్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.
కారు ఎవరిది? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? యజమాని ఎవరు? అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడానికి గల కారణాలు ఏంటి? అనేదానిపై పోలీసుల విచారణ జరుగుతోంది. కాగా, ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్ తో ఈ కారు ఉంది. ఇది ఆకతాయి పనా? ఉగ్రకోణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కారు ఘటనతో ఢిల్లీ అసెంబ్లీ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
Also Read: మామూలు ఆఫీసర్ కాదు.. భార్యతో పాటు గర్ల్ ఫ్రెండ్, పని మనిషికి కూడా రూ. కోట్ల ఆస్తులు.. లగ్జరీ లైఫ్
ఈ ఘటన ఒక పెద్ద భద్రతా లోపంగా చెప్పొచ్చు. ఇనుప బారికేడ్ను ఢీకొట్టిన కారు ఏకంగా ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలోకి దూసుకెళ్లడం.. భద్రతా సిబ్బందిలో ఆందోళన రేకెత్తించింది. డ్రైవర్ లోపల కాసేపు ఆగాడు. స్పీకర్ కార్యాలయం బయట వరండాలో పూలగుత్తి ఉంచి ఆ తర్వాత వాహనంతో పారిపోయాడు. అధికారుల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రిజిస్ట్రేషన్ నంబర్ గల టాటా సియెర్రా కారు కాంప్లెక్స్లోకి ప్రవేశించి గేట్ నెం. 2 ద్వారా బయటకు వెళ్లే ముందు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే లోపల ఉంది.
పూలగుత్తి వదిలివెళ్లిన దుండగుడు..
దుండగులు వదిలివెళ్లిన పూలగుత్తిని సెక్యూరిటీ సిబ్బంది ముమ్మరంగా చెక్ చేశారు. అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని అధికారులు తెలిపారు. ఆ పూలగుత్తి ప్రమాదకరం కాదని తేల్చారు. ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో గందరగోళం సృష్టించిన తర్వాత ఆ వ్యక్తి గేట్ నెం. 2 ద్వారా ఎలా బయటకు వెళ్లగలిగాడనేది అస్పష్టంగానే ఉంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఒక తెల్ల కారు అసెంబ్లీలోకి ప్రవేశించిన తర్వాత కొద్దిసేపు లోపల ఉండి, బయటకు వచ్చి అక్కడి నుంచి అదృశ్యమైంది. ఈ దుస్సాహస చర్య రాష్ట్ర శాసనసభ వద్ద భద్రతా ప్రోటోకాల్స్పై తీవ్ర ఆందోళనలను రేకెత్తించింది. “మేము ఇక్కడ పైన ఉన్న గ్రిప్ ఏరియా దగ్గర నిలబడి ఉన్నాము. అప్పటికే ఒక కారు లోపలికి ప్రవేశించడాన్ని మేము చూశాము. దాంతో మేము ఈ వైపుకు వచ్చి చూడగా, అది ఒక తెల్ల కారు. అది నేరుగా వచ్చి, గేటును పగలగొట్టి, ఆ దిశగా వేగంగా వెళ్లిపోయింది” అని ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
”మేమందరం ఇక్కడే నిలబడి ఉన్నాము. ఆ శబ్దం వినపడగానే అందరూ ఇక్కడ గుమిగూడారు. రిక్షా డ్రైవర్లు కూడా వచ్చారు” అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో గేటు విరిగిపోవడంతో పెద్ద శబ్దం వినిపించిందని అక్కడే ఉన్న పలువురు చెప్పారు. ‘ఆ శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నించగా, కారు లోపలికి ప్రవేశించిందని గమనించాం. మేము దానిని గమనిస్తూ ఉండగా, అది వెనక్కి వచ్చి, మళ్లీ గేటును పగలగొట్టి, వేగంగా వెళ్లిపోయింది’ అని మరో ప్రత్యక్ష సాక్షి తెలిపారు.
వాహనాన్ని గుర్తించి డ్రైవర్ను పట్టుకోవడానికి ఢిల్లీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా సమగ్ర దర్యాప్తును ప్రారంభించారు.
