Bengaluru: విమానంలో నిద్రిస్తున్న మహిళ ప్రైవేట్ భాగాల్ని తాకిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
పక్కనే కూర్చున్న వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. నిందితుడు తన ప్రైవేట్ భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది
Bengaluru: కర్ణాటకలోని లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమానంలో ఓ మహిళపై వేధింపుల ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నడివయసు ఉన్న ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెంగళూరు వస్తున్న విమానంలో మహిళపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. బాధిత మహిళ వయస్సు 32 సంవత్సరాలు. బాధితురాలు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నివాసి. ఈ సంఘటన నవంబర్ 6వ తేదీన జరిగింది. తనపై దాడి జరిగిన సమయంలో ఆ మహిళ విమానంలో నిద్రపోతోంది.
మహిళ నిద్రిస్తుండగా.. పక్కనే కూర్చున్న వ్యక్తి ఆమెను అనుచితంగా తాకినట్లు ఫిర్యాదులో వెల్లడైంది. నిందితుడు తన ప్రైవేట్ భాగాలను తాకి అసభ్యంగా ప్రవర్తించాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. తను ఆ సమయంలోనే అభ్యంతరం వ్యక్తం చేశానని, అయితే ఆ తర్వాత కూడా నిందితుడు తనపై వేధింపులు కొనసాగించాడని వాపోయింది. ఇక చేసేదేమీ లేక.. విమాన సహాయకుడిని అభ్యర్థించి తన సీటు మార్చుకుంది.
బెంగళూరులో విమానం దిగగానే బాధితురాలు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లో నిందితులపై ఫిర్యాదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 354ఏ (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. అరెస్టు అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. ఆ తర్వాత నిందితుడు బెయిల్ మీద విడుదల అయ్యాడు.