Iran Israel War : పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్.. ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈసారి మరిన్ని ఇబ్బందులు..! వాటి ధరలు భారీగా పెరిగే చాన్స్..
Iran Israel War : భారతదేశంలో ఇంధనం, గ్యాస్ కొరత మరింత పెరిగే చాన్స్ ఉంది. ఎందుకంటే.. హర్మూజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు బయటకు వస్తున్న ఒకటి రెండు నౌకలు కూడా ఇక కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా నౌకాదళం సోమవారం రాత్రి 7.30గంటల నుంచి హర్మూజ్ దిగ్భంధం మొదలు పెడతామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
Middle East Tensions
Iran Israel War : పశ్చిమాసియాలో మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్, అమెరికా దేశాల మధ్య సుదీర్ఘంగా జరిగిన శాంతి చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ – అమెరికా టెన్షన్లు పతాక స్థాయికి చేరడంతో మళ్లీ ఇంధన ధరలు భగ్గుమన్నాయి.
Also Read : USA- Iran peace talks : అమెరికా- ఇరాన్ చర్చలు విఫలం.. జేడీ వాన్స్ సంచలన ప్రకటన.. ఇరాన్ ఏమన్నదంటే?
ఆదివారం రాత్రి 11శాతం పెరిగిన బ్యారెల్ 105 డాలర్ల వద్దకు చేరింది. అమెరికాకు చెందిన డబ్ల్యూటీఐ క్రూడ్ 104.2 డాలర్లను తాకింది. మరోవైపు బ్రెంట్ క్రూడ్ ధర 101 డాలర్లను చేరింది. ఇప్పటి వరకు హర్మూజ్ నుంచి జరుగుతున్న స్వల్ప స్థాయి చమురు, గ్యాస్ ఎగుమతులు కూడా నిలిపోనుండటంతో ఆసియా దేశాలకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు.
ముఖ్యంగా భారతదేశంలో ఇంధనం, గ్యాస్ కొరత మరింత పెరిగే చాన్స్ ఉంది. ఎందుకంటే.. హర్మూజ్ జలసంధిని దాటి ఇప్పటి వరకు బయటకు వస్తున్న ఒకటి రెండు నౌకలు కూడా ఇక కదిలే పరిస్థితి ఉండకపోవచ్చు. అమెరికా నౌకాదళం సోమవారం రాత్రి 7.30గంటల నుంచి హర్మూజ్ దిగ్భంధం మొదలు పెడతామని సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లూ భారత్ కు చెందిన ఒకటి రెండు నౌకలకు మార్గం సుగమం అయినప్పటికీ.. ఇప్పడు ఆ పరిస్థితి లేకపోవటంతో ఇంధన, గ్యాస్ కొరతతోపాటు ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందన్న వాదన ఉంది.
శాంతి చర్చలు విఫలం కావడంతో అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి కమ్ముకున్న యుద్ధ మేఘాల ప్రభావం ఈసారి తీవ్రంగానే ఉంటుందని ఇంధన రంగ నిపుణులు, విశ్లేషకులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులోనే కొరత ఏర్పడే అవకాశాలు ఉన్నందున ప్రత్యామ్నాయ మార్గాల దిశగా వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు తెలంగాణ సర్కార్ సమాయత్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర పౌరసరఫరాల శాఖ యంత్రాంగం ఆ దిశగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసింది. కొరత ఏర్పడిన తరువాత పరిణామాల తీవ్రతను తగ్గించేందుకు క్షేత్ర స్థాయి వరకూ అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదే సమయంలో ఇంధన కొరతకు ఏకైక, తక్షణ ప్రత్యామ్నాయం విద్యుత్ కావడంతో ఆ దిశగా కూడా అధికారులు సంసిద్ధమవుతున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమైతే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే చాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పెట్రోల్ పై లీటరుకు కనిష్ఘంగా రూ.20, డీజిల్ పై రూ.15వరకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సీఎస్జీ, వంట గ్యాస్ సిలిండర్ ధరలపైనా తీవ్ర ప్రభావం ఉండనుంది. 60రోజులకు సరిపడే నిల్వలున్నాయంటూ పక్షం రోజుల క్రితంత కేంద్రం ప్రకటన తరువాత దేశంలోకి వచ్చే దిగుమతులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.
దీంతో అరవై రోజులకు సరిపడే నిల్వలు కాస్త ఇరవై రోజుల అవసరాలు మాత్రమే తీర్చనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే వచ్చే మూడు వారాల్లోనే ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలపై పెను భారం పడే అవకాశాలు ఉన్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు.
