Myanmar troops : మయన్మార్లో మారణ హోమం కొనసాగుతోంది. సైనిక దమనకాండలో 80మందికి పైగా పౌరులు మరణించారు. బాగో నగరంలో నిరసనకారులపై దళాలు గ్రెనేడ్లతో దాడి చేయగా.. 80 మందికి పైగా మరణించినట్లు నివేదిక వెల్లడించింది. శుక్రవారం తెల్లవారుజామున సైనిక తిరుగుబాటును వ్యతిరేకిస్తున్న పౌరులపై భద్రతా దళాలు విరుచుకుపడ్డాయి.
సైనికులు రైఫిళ్లు, భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పౌరులపై మారణ హోమానికి తెగబడ్డారని ప్రత్యక్ష సాక్షులు నివేదించారు. నిరసనకారులు ఏర్పాటు చేసిన రోడ్బ్లాక్లు ధ్వంసమయ్యాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 82 మంది నిరసనకారులు మరణించినట్లు అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ఖైదీల (AAPP) పర్యవేక్షణ బృందం వెల్లడించింది. రెండు నెలల క్రితం సైన్యం మయన్మార్పై పట్టు సాధించింది.
గత రెండు నెలల క్రితం నుంచి మయన్మార్లో జరిగిన సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రజల ఆందోళనలను అణచివేసేందుకు బర్మా మిలిటరీ అత్యంత కఠినంగా, కర్కషంగా వ్యవహరిస్తోంది. కనిపించిన వారిని కనిపించినట్టే కాల్చి చంపేస్తోంది. గ్రెనేడ్లను విసరడంతో దాదాపు 80మందికి పైగా పౌరులు మరణించారు.