Ananthapadmanabha Swamy Temple : ‘బబియా’ మరణించిన ఏడాదికి! అనంత పద్మనాభస్వామి ఆలయ కొలనులో కొత్త మొసలి
కొలనులో ఒక మొసలి మరణించిన తరువాత కొద్దిరోజులకు మరో ముసలి కనిపించడం జరుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కొలనులో కనిపించిన మొసలి నాల్గోదని, గతేడాది క్రితం మరణించిన బబియా ..

Ananthapadmanabha Swamy Temple
Kerala Temple Crocodile : కేరళలోని కాసరగోడ్ జిల్లాలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి ఆలయంలో పునర్జన్మ పొందిన దేవతగా భావించే పూణ్యమైన మొసలి ‘బబియా’ సంవత్సరం క్రితం మరణించిన విషయం తెలిసిందే. ఆ మొసలి మరణించిన ఏడాది తరువాత ఆలయం సరస్సులో కొత్త మొసలి కనిపించింది. నవంబర్ 8న ఈ మొసలిని కొందరు భక్తులు గుర్తించి ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ఆలయ చైర్మన్ ఉదయ్ కుమార్ గట్టి నూతన మొసలి ఉనికిని ధృవీకరించారు. ఆలయ ప్రధాన పూజారికి ఆ సమాచారం అందించామని, ఏం చేయాలో ఆయనే నిర్ణయించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
కొలనులో ఒక మొసలి మరణించిన తరువాత కొద్దిరోజులకు మరో మొసలి కనిపించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం కొలనులో కనిపించిన మొసలి నాల్గోదని, గతేడాది క్రితం మరణించిన బబియా మూడో మొసలి అని అధికారులు తెలిపారు. అయితే, బబియా మొసలి గతేడాది అక్టోబర్ 9న మరణించింది. దాని వయస్సు 70కుపైగానే ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు. బబియా మరణించినప్పుడు చివరిచూపుకోసం రాజకీయ నాయకులతో సహా వందలాది మంది తరలివచ్చారు. ఈ బబియా మొసలి పూర్తి శాఖాహారి. ఆలయంలో తయారు చేసిన ప్రసాదాన్నే ఆహారంగా తీసుకునేది.
బబియా కొలనులో ఏర్పాటు చేసిన షెడ్డులో నివసించేది. ప్రధాన పూజారి రాత్రి ఆలయం నుంచి బయటకు వెళ్లినప్పుడు బబియా ఆలయ ప్రాంగణంలోకి వచ్చి మందిరానికి కాపలాగా ఉండేదని, తెల్లవారు జామున ఆలయ ద్వారాలు తెరుచుకునే శబ్దాలువిని అది ప్రశాంతంగా కొలను లోపలికి వెళ్లేదని ఆలయ అధికారులు తెలిపారు.